రుతువులు, కాలాలు మారే రోజుల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతాయి. వాటిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మందికి వచ్చే వ్యాధి జలుబు. అందుకే జలుబు పట్టిందంటే ఒక పట్టాన పోదంటారు. అంతే కాకుండా అది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి ప్రబలే ప్రమాదం ఉంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది త్వరగా ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది. కాబట్టి జలుబు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. అందుకే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. జలుబును తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పని చేస్తుంది. ప్రతి రోజూ మూడు పూటలా మూడు చుక్కల జిందా తిలిస్మాత్ ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు రాత్రి పూట పడుకునే ముందు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు తగ్గు ముఖం పడుతుంది. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి, బాగా మరిగించి... తర్వాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. అల్లం ముక్కలను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని దానికి కాస్త జీలకర్ర, చక్కెర కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. జలుబు నుంచి రిలీఫ్ పొందినా.. దగ్గు మాత్రం అంత తొందరగా వదిలి పోదు. దగ్గును అరికట్టడంలో కరక్కాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. కరక్కాయ ముక్కలను దవడ కింద ఉంచుకుని ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశపనం పొందొచ్చు.