ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమయ్యాయి. వైద్య సహాయం లేనిదే రోజులు గడవడం కష్టమైపోయింది. వ్యాధి తీవ్రత తక్కువున్నా, ఎక్కువున్నా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే. చిన్న వ్యాధికైనా బారెడు చిట్టీతో మందులు కొని మింగాల్సిందే. సొంత వైద్యానికి తావులేదిప్పుడు. అలా చేశామంటే దుస్సాహసమే. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టే. ఉన్న రోగం నయం కాకపోవడమే కాకుండా మరొకటి పుట్టుకురావడం ఖాయం. అయితే.. ఇది కేవలం సొంత వైద్యం వల్లే అవుతుందని కచ్చితంగా చెప్పలేం. డాక్టర్లు రాసిన కొన్ని మందుల వల్ల కూడా దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉంటాయి. కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు మనకు వెంటనే తెలిసి పోతాయి. మరికొన్ని తెలియడానికి రోజులు, వారాలు పట్టొచ్చు. ఇంకొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు వెంటనే ఏమీ తెలియవు. కొన్ని నెలల తర్వాత ఒక్కొక్కటిగా బయటపడతాయి.
మందుల దుష్ప్రభావాలు కనిపించగానే కొన్ని విషయాలు పరిశీలించాలి. ఆ మందు ఎప్పుడు తీసుకోవడం మొదలెట్టాం..? దుష్ప్రభావం ఎప్పటి నుంచి మొదలైంది? అనే విషయాన్ని గమనించాలి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం తీసుకుంటున్న మందుల వల్లేనా.. మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలించాలి. అయితే.. ఈ సమయంలో రోగి భయపడిపోవద్దు. తొందరపడొద్దు కూడా. ఏవో కొద్ది దుష్ప్రభావాలు కనిపించగానే సొంత నిర్ణయంతో మందులు మానేయొద్దు. లక్షణాలు కనిపించగానే ఆ మందులు సూచించిన వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడే సరైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ వేరే మందులు రాయడం గానీ, అదే మందును తక్కువ మోతాదులో వేసుకొమ్మని సూచించడం గానీ చేస్తారు. అదే సమయంలో అప్పటికే కలిగిన దుష్ప్రభావాలను నియంత్రించే మందులు కూడా సూచించొచ్చు. అన్ని దుష్ప్రభావాలు అంత తీవ్రంగా ఏమీ ఉండవు గానీ, ఒళ్లంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం క్షణమైనా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
పాతవే వాడొద్దు..
కొందరు డాక్టర్ని సంప్రదించకుండానే మందులు వేసుకుంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు డాక్టర్ రాసిచ్చిన మందులనే ఆ తర్వాత కూడా అదే చిట్టీతో కొనుక్కొని వేసుకోవడం చాలామందికి అలవాటు. ముందెప్పుడో రాసిన మందులు వేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడల్లా డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఆ సమయంలో రాసిచ్చిన మందులను వాడాల్సిందే. ఎప్పుడో వచ్చిన దానికన్నా ఇప్పుడొచ్చిన ఆరోగ్య సమస్యలో తేడా ఉండొచ్చు. అప్పటికన్నా ఇప్పుడు మరికొన్ని లక్షణాలు మారొచ్చు. అప్పుడెప్పుడో రాసినవే కదా.. అని అదే చిట్టీపై మందులు తీసుకుని వేసుకుంటే దుష్ప్రభావాలు తప్పవు.
పెయిన్కిల్లర్స్తో జాగ్రత్త!
నొప్పిని నివారించే మందులు వెంటనే ఉపశమనం ఇస్తాయి. అయితే వాటిని కొద్ది మోతాదుల్లోనే వాడాల్సి ఉంటుంది. మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి. ముఖ్యంగా అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని పొరల వరకు ప్రభావాన్ని చూపుతాయి. ప్రధాన రక్తనాళాల చివర ఉండే సన్నటి నాళాలతోపాటు మూత్రపిండాల్లోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి. కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. మామూలుగానైతే కొన్ని యాంటాసిడ్ని తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి. అంతకు మించి వాడొద్దు. రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునేవారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెఫ్రోపతి అత్యంత ప్రమాదకరం. మన రక్తంలో రోజువారీ వడపోత సక్రమంగా జరగాలంటే మూత్రపిండాల్లో 30 శాతమైనా సరిగా పనిచేయడం అవసరం. నొప్పి నివారణ మందులు వాడేవారిలో ఈ సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నొప్పి నివారణ మందులతో కిడ్నీ సమస్యలు వచ్చినవారు చాలా ఎక్కువ. ఇలాంటివారిలో గుండె పనితీరుపై మరింత ఒత్తిడి పడి గుండెజబ్బులు రావచ్చు. ఈ మందులు పరిమితికి మించి వాడటం వల్ల కడుపు లోపల ఉండే పొరలు దెబ్బతినొచ్చు. కొందరికి మేజర్ సర్జరీ కూడా అవసరం కావచ్చు. కొందరిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్పై దుష్ప్రభావం పడి కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. వీటితోపాటు మరికొన్ని జాగ్రత్తలు అవసరం. నొప్పి నివారణ మందులు పరగడుపున వాడకూడదు. ఈ మందులు వేసుకున్న తర్వాత నీరు ఎక్కువగా తాగాలి. ఇవి క్రమం తప్పకుండా వాడాల్సి కొన్ని రోజులు వ్యవధి ఇవ్వాలి. మళ్లీ డాక్టర్ సలహా మేరకే వాడాలి. నొప్పి నివారణ మందులు వాడే సమయంలో తరచూ మూత్రపిండాలు, బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి.
కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే...
మందులు ఒకదానిపై ఒకటి పనిచేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
- టెట్రా సైక్లిన్ వేసుకుని పాలు లేదా పెరుగు తీసుకుంటే మాత్ర సరిగా పనిచేయదు.
- ఎరిత్రోమైసిన్ మాత్ర వేసుకుని మోసంబి జ్యూస్ తీసుకోవద్దు
- డిప్రెషన్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు.
- డయాజెపమ్ వేసుకున్న తర్వాత సిగిరెట్టు తాగితే మాత్ర ప్రభావం తగ్గుతుంది
- వైరల్ వ్యాధులకు ఉపయోగించే ఆస్పరిన్ మందుల వల్ల రేస్ అనే వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు వాంతులు కావడంతో పాటు దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతిం టుంది.
- టెట్రాసైక్లిన్ ఔషధాలు ఎక్కువగా వాడితే దంతాలపై ఉండే ఎనామిల్ తొలిగిపోయి. దంతాల రంగు మారుతుంది.
- స్టీరాయిడ్స్ వాడితే చిన్నపిల్లల్లో శారీరక, మానసిక పెరుగుదల ఆగిపోతుంది.
- చిన్న పిల్లలకు మందులు వాడేటప్పుడు మోతాదును జాగ్రత్తగా గమనిం చాలి. ఎక్కువ మోతాదు లో మందులు ఇస్తే దుష్పరిణామాలు సంభవి స్తాయి. కొన్నిసార్లు పిల్లలు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.
- ఎలాంటి మందులు వాడుతున్నారు? వాటి మోతాదు విషయాలు ఫార్మసిస్టు ద్వారా తెలుసుకోవాలి.
- గర్భిణులు మందుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే కడుపులోని బిడ్డపై దుష్పరిణామాలు చూపుతాయి.
- వాంతులు, మలబద్ధకం వంటి చిన్నచిన్న సమస్యలకు మందులు వాడొద్దు. పారాసెటమాల్, వొవెరాన్, నైస్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే పుట్టబోయే శిశువులో కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి.
- కొన్ని మందులు విచక్షణంగా వాడితే దుష్ప్రభావాలు ఉంటాయి. మరో వ్యాధికి దారి తీస్తాయి.
- పారాసిటమోల్తో కాలేయం క్షీణిస్తుంది.
- ఆస్ప్రిన్తో పేగులో రక్తస్రావం కలుగుతుంది.
- నైస్ (నిమెసులైడ్)తో గుండె జబ్బులు సంభవిస్తాయి.
- జెంటామైసిన్తో చెవుడు వస్తుంది. కిడ్నీలపై ప్రభావం పడుతుంది.
- స్ట్రీరాయిడ్తో గ్లాకోమా (కంటి సమస్య) వస్తుంది.
- వొవెరాన్ ( డైక్టోపెనాక్ సోడియం)తో కడుపులో రక్తస్రావం అవుతుంది.
- స్ట్రెప్టోమైసిన్తో చెవుడు వస్తుంది.
- డాక్టర్ సంజరు రెడ్డి, జీఎల్పీ సైంటిస్ట్
Authorization