మానవ జీవితంలో మానసిక ఒత్తిడి పరిపాటిగా మారింది. ఇది అనేక రోగాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా గుండె వ్యాధులు రావడానికి ఇదే ప్రధాన కారణం. 30-40 ఏండ్లకే చాలామంది హృద్రోగాల బారిన పడుతున్నారు. అంతేకాదు.. అనేక ఇతర ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ఇలాంటి రుగ్మతలు దరిచేరొద్దంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లైట్గా తీసుకోవాలి.
గుండె జబ్బులు రావడానికి అనేక కారణాలు. ముఖ్యంగా మధు మేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం లాంటివి హృద్రో గాలకు దారి తీస్తాయని చెప్పుకుంటాం. అయితే.. వీటన్నింటికన్నా ప్రమాదకరమైనది మానసిక ఒత్తిడి. గుండె జబ్బులు రావడానికి ఇది ప్రధాన కారణం.
ఆరోగ్యకరమైన ఒత్తిడి వల్ల శరీరం నుంచి హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో మనమెంతో చురుగ్గా పనిచేస్తాం. 'అక్యూట్ స్ట్రెస్, 'క్రానిక్ స్ట్రెస్' మాత్రం అలాంటిది కాదు. చాలా ప్రమాదకరమైనవి. ఒత్తిడికి గురికావడం వల్ల శరీరం పనితీరులో తీవ్రమైన మార్పు వస్తుంది. రక్త సరఫరా, నాడీ వ్యవస్థలో తేడా వస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే ఒత్తిడికి లోనయ్యేవారు పొగతాగడం, అతిగా తినడం వంటివి చేస్తుంటారు. వీటి వల్ల గుండెజబ్బులు సంభవిస్తాయి. తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారికి ఛాతీ నొప్పి వస్తుంది. గుండెకు వెళ్లే రక్త సరఫరాలో మార్పులు వస్తాయి. ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. భావోద్వేగాలకు గురై మానసికంగా కుంగిపోతారు. ఒత్తిడి గురైయ్యే వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతుంటారు. ప్రతికూల ఆలోచనా ధోరణి పెరుగుతుంది. ప్రతిదానికీ తీవ్రంగా స్పందిస్తుంటారు. తరచూ తలనొప్పి, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతుంటారు. బరువు విపరీతంగా పెరుగుతుంది. లేదా తగ్గిపోతుంది. డిప్రెషన్, నిద్రలేమి బాగా ఉంటుంది.
కొందరిలో మరింత తీవ్రం
మానసిక ఒత్తిడి కొందరిలో తీవ్ర గుండెజబ్బులకు కారణమవుతుంది. తీవ్రమైన కార్డియోమయోపతి లేదా బ్రేకెన్ హార్ట్ సిండ్రోమ్కి దారి తీస్తుంది. ఈ ఒత్తిడి కూడా అందరిలోనూ ఒకేలా ఉండదు. అయితే.. దాన్ని నియంత్రించడానికి ఏవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. తరచూ అనారోగ్యానికి గురవడం వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా రక్త పీడనం పెరుగుతుంది. ఫలితంగా మధుమేహ సమస్యతోపాటు ఛాతీ నొప్పి వస్తుంది. హృదయ స్పందన రేటు అధికవుతుంది. వీటి వల్ల 'కార్డియాక్ న్యూరోసిస్' కూడా కలిగే అవకాశం ఉంది.
ప్రవర్తనలో మార్పు
ఒత్తిడికి గురయ్యే వారి ప్రవర్తనలో తీవ్ర మార్పులు కనిపిస్తాయి. తరచూ అనారోగ్యంతో బాధపడటం, ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు, భార్యాభర్తలు, స్నేహితుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు వంటి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయానికీ అనుమానం వ్యక్తం చేయడం లాంటి ధోరణి అలవడుతుంది. వీరి కారణంగా ఇతరులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఏకైక మార్గం.
ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే...
మానసిక ఒత్తిడి అనేది చాలా ప్రమాదకరం. గుండెపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధ్యమైనంత వరకు ప్రశాంత జీవితం గడపాలి. కోపం అనేది మానిసిక ఒత్తిడిని పెంచుతుంది. ప్రధానంగా గుండెకు సరఫరా చేసే నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి వల్ల గుండె సాధారణ స్థితికి మించి కొట్టు కోవడం, బ్లడ్ షుగర్ పెరగడం, బీపీ పెరిగిపోవడం వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడి తీవ్రతతో మనిషిలో అడ్రినలిన్ హార్మోన్ విడుదలై శ్వాస తీసుకోవడంలో వేగం పెరుగుతుంది. గుండెతోపాటు పల్స్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇది ప్రమాదకర స్థితికి చేరే ఆస్కారం ఉంది.
ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెంద డం ద్వారా గుండె కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మధుమేహంతో సతమతమయ్యే వారి రక్త నాళాలు దెబ్బతినడంతో ఇతర విషమ అనారోగ్య పరిస్థి తులు తలెత్తుతాయి. ఈ రుగ్మత ఉన్న వారికి ఇతర వ్యాధులు వస్తే తొందరగా నయం కావు. ఇలాంటి వారు వైద్య నిపుణుల సలహాలు పాటిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటే మంచిది. తొలి దశలో గుండె జబ్బులను గుర్తించే వీలుంది. కాబట్టి పరీక్షలు చేయించుకోవాలి. అందుకు తగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.
- డాక్టర్ అశ్విన్ తుంకూర్, కార్డియాలజిస్ట్
Authorization