వయసు పెరిగే కొద్దీ శరీరంలో వస్తున్న మార్పుల వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మెదడు పనితీరులో మార్పు వస్తుంది. జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడాన్నే వైద్య పరిభాషలో అల్జీమర్స్గా పిలుస్తారు. ఇది మెదడుకు, వాటిలోని నరాలకు సంబంధించిన సమస్య. ఈ వ్యాధి వచ్చిన వారి ప్రవర్తనలోనూ, పనుల్లోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రారంభంలో మెదడు భాగాలపై ప్రభావం చూపిస్తూ... జ్ఞాపకశక్తిలో, క్రమేపీ ఆలోచనా విధానంలో, మాట్లాడే విధానంలో మార్పును తీసుకొస్తుంది. ఈ సమస్య వయసు పెరిగే కొద్దీ తీవ్రమవుతుంది. అయితే ముందుగానే గమనిస్తే.. దీనిని చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం!
శరీరంలో కొన్ని కణాలు వయసు పెరుగుతున్న కొద్దీ పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా కంటిచూపు, వినికిడి శక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి మార్పులు మెదడులోనూ ఉంటాయి. కానీ మిగతా వాటితో పోలిస్తే ఈ మార్పులు కాస్త ఎక్కువగా ఉంటాయి. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పో క్యాంపస్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ కణాల సంఖ్య తగడంతో అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఎక్కువ మందిలో మతిమరుపు రావడానికి కారణమౌతుంది. ఇది ముఖ్యంగా 55 ఏండ్ల తరువాత వస్తుంది. ఒక్క శాతం మందికి మాత్రమే వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంది. పురుషుల కంటే స్త్రీలలో మూడింతలు ఎక్కువ...
ప్రారంభంలో నిదానంగా మతిమరుపు లక్షణాలు వస్తాయి. మొదట రోజువారీగా జరిగే చిన్న విషయాలు మరచిపోతూ ఉంటారు. దూరబంధువుల పేర్లు, తక్కువగా ఉపయోగించే పదాలు మొదట మరిచిపోతారు. చెప్పిన మాటలే పదే పదే మాట్లాడుతూ ఉంటారు. 5-10 నిముషాల ముందు జరిగిన విషయాలు కూడా మరిచిపోతారు. రానురాను ఒకటి రెండు రోజుల ముందు విషయాలు మరిచిపోతారు. పాత విషయాలు మాత్రం చివరి వరకూ గుర్తుంటాయి. దీనినే 'రిబోట్ లా ఆఫ్ మెమోరీ' అంటారు. క్రమేపీ మాటలు రావడం తగ్గుతుంది. తమ ఇంటికి లేదా బాగా తెలిసిన దారి కూడా మరిచిపోతారు. ఉదయ సాయంకాలాలకు తేడా కనుక్కోలేరు. లెక్కించటం కూడా కష్టమవు తుంది. రోజూ ఉపయోగించే వస్తువులు ఉపయోగించడం కూడా మరిచిపోతారు. ఉదాహరణకు సాక్సులు, షూలు వేసుకోవడం, సంతకం చేయడం మరచిపోతారు. రాను రాను తరచూ వాడే మాటలు కూడా మరచి పోతారు. ఆఖరి దశలో నడక కూడా మారిపోతుంది. కాకపోతే ఈ జబ్బుతో ప్రాణహాని ఉండదు.
రకరకాల ఇన్ఫెక్షన్లతో..
ప్రపంచంలో ప్రతి వెయ్యిమందిలో పది నుంచి పదిహేడు మంది, మన దేశంలో ప్రతి వెయ్యిమందికి నాలుగు నుంచి పదిహేడు మంది అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నారు. అల్జీమర్ డిమెన్షియా అనేది నయం కాని మెదడు సంబంధ వ్యాధి. వ్యాధి ఉందని నిర్ధారించిన తరువాత ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పెరుగుతుంది. దీంతో వచ్చే కొన్ని ఇబ్బందులతో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. చాలామంది వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. ఒక్కోసారి రకరకాల కారణాల వలన యుక్తవయసు, మధ్యవయస్సు వారిలోనూ అల్జీమర్స్ కనిపిస్తుంది. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్ వ్యాధికి దారి తీయవు.
లక్షణాలు
రక్తంలో సోడియం, క్రియాటీన్, థైరాయిడ్ హార్మోను మోతాదు తగ్గితే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
- ఇంట్లో వారి పేర్లు మరచిపోవడం,
- వెళ్ళవలసిన దారి మర్చిపోవడం,
- పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేకపోవడం.
- అక్షరాలూ, అంకెలూ గుర్తుపట్టడంలో ఇబ్బంది,
- ప్రస్తుత సమయం, తేదీ, రోజులను మర్చిపోవడమేకాక, బాగా పరిచితమైన వ్యక్తులను, స్థలాలనూ గుర్తుపట్టకపోవచ్చు. తన ఇంటి చిరునామా మర్చిపోవచ్చు.
- ఉండే చోటు లేదా పనిచేసే చోటు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా మర్చిపోవచ్చు.
- మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించలేకపోవచ్చు, పదాలు సరిగ్గా చెప్పలేకపోవచ్చు లేదా మాట్లాడిన, రాసిన పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
- దేనినీ సరిగా అంచనా వేయలేకపోవడం, స్వయంగా నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం వంటి సమస్యలేర్పడతాయి.
- మానసిక సమస్యలు పెరుగుతాయి.
- ఆత్రుత, భయం పెరుగుతుంది.
- తక్కువగా ఉపయోగించే పదాలు మర్చిపోతారు.
- చెప్పిన మాటలే పదే పదే మాట్లాడుతూ ఉంటారు.
కారణాలు
మెదడులోని కణాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోయినా, రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెజబ్బులు, స్ట్రోక్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు దెబ్బతిన్నే సందర్భాలలో అల్జీమర్స్ రావచ్చు. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల వల్ల రక్తనాళాలు దెబ్బతింటే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నిర్ధారణ..
సాధారణ రక్తపరీక్ష ద్వారా అల్జీమర్స్ వ్యాధిని తెలుసుకోవచ్చు. ఇదేకాక ఎం.ఆర్ఐ, సిటీ స్కాన్ చేయడం వల్ల దీనిని నిర్థారణ చేయవచ్చు. వెన్నులోని కొంత నీరు తీసుకుని, సి.ఎస్.ఎఫ్ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.
కుటుంబసభ్యుల సహకారం ..
అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే మందులతో నియంత్రిం చవచ్చు. మందులు సరిగ్గా వాడితే మూడు నుంచి ఆరు నెలల్లో మంచి ఫలితాలు వస్తాయి. మందులే కాకుండా రోగికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. వయసు పెరగడంతో పాటు పెద్దవారిలో వచ్చే ఈ సమస్యలను ఇంట్లో వారు అర్థం చేసుకోని రోగికి రోజూ చేసే పనులు గుర్తుచేస్తుండాలి. అల్జీమర్స్కు గురైన వ్యక్తిని ఒంటరిగా బయటకు పంపకూడదు. మానసిక ఒత్తిడి పెరిగితే సమస్య తీవ్రత పెరుగుతుంది. అందుకని ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
మెదడుని చురుగ్గా ఉంచే..
అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు రాకుండా మెదడు చురుగ్గా పని చెయ్యాలంటే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
తాజాగా తెలిసిన విషయమేంటంటే... పసుపులోని క్యూర్కుమిన్ అనే పదార్థానికి మతిమరపు వ్యాధి అయిన అల్జీమర్స్, మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీసే డిమెన్షియా లాంటి వ్యాధులను అరికట్టే అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ నిపుణులు చేసిన పరిశోధనల ద్వారా మెదడులోని కణాలను దెబ్బతీసేవాటిని క్యూర్కుమిన్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
అంతేగాకుండా, వారంలో రెండు లేదా మూడుసార్లు క్యూర్క్యుమిన్తో కూడిన వంటకాన్ని ఆరగించినట్లయితే... అల్జీమర్స్, డిమెన్షియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటున్నట్లు వారి పరిశోధనల్లో రుజువైంది.
పండ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
పండ్లు ఎక్కువగా తినేవారికి అల్జీమర్స్ ముప్పు తక్కువని అమెరికాలో ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని నిపుణుల అభి ప్రా యం. చేపలు, త ణధాన్యాలు తరచుగా తీసుకుంటే మంచిది.
మిరప.. మిరియాలు.. బెస్ట్
ఇప్పటి దాకా జరిగిన అధ్యయనాల్లో మిరప, మిరియాలు వంటివి ఎక్కువ తినటం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే అవిసెలు, సోయాబీన్స్, అక్రోట్ల వంటి ఎండు పండ్లను తరచూ తీసుకోవటం వల్ల మెదడుతో పాటూ గుండె, కీళ్ల ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది
- విటమిన్-కె ఎక్కువగా ఉండే అరటి, క్యాలిఫ్లవర్, బ్రకోలీ వంటివాటిని కూడా తీసుకోవడం చాలా అవసరం.
- యాంటీ ఆక్సిడెంట్ గుణాల గల విటమిన్-సి వయసుతో పాటు మెదడు క్షీణించటం, అల్జీమర్స్, డిమెన్షియా నుంచి కాపాడుతుంది. ఇది అధికంగా ఉండే నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లను తీసుకోవాలి.
Authorization