సూక్ష్మక్రిములతో మనకు నిత్య సమరం తప్పదు. మనం ఎక్కడన్నా కొంచెం బలహీనపడ్డామంటే చాలు, అవి విజృంభించి వ్యాధులను తెచ్చిపెడుతుంటాయి. ఒకప్పుడు మన శరీరం వాటితో ఒంటరి పోరాటమే చెయ్యాల్సి వచ్చేది. అందులో మనం గెలిస్తే బతికే వాళ్లం. లేకుంటే ప్రాణాలపై ఆశలు వదులకునేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పరిశోధనల్లో చాలా యాదృచ్ఛికంగా పుట్టింది పెన్సిలిన్. ఇదే మానవాళి చరిత్రను కీలకమలుపు తిప్పిన మొట్టమొదటి యాంటీబయాటిక్. బ్యాక్టీరియాను సంహరించి, మన ప్రాణాల్ని కాపాడటంలో వరంలాంటి ఔషధం ఇది. దీనితో మొదలైంది మన యాంటీబయాటిక్స్ ప్రస్థానం. ఈదారిలో ప్రయోగాలు సాగించిన శాస్త్రవేత్తలు రకరకాల యాంటీ బయోటిక్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ రకరకాల బ్యాక్టీరియాను సంహరించే అస్త్రాలే.
ప్రపంచంలో కెల్లా యాంటీబయోటిక్స్ను ఎక్కువగా వాడుతున్నది మనదేశం లోనే..! దీనివల్ల మందులు వేసుకున్నా.. నయం కాని మొండి అంటు వ్యాధులు నానాటికీ పెరుగుతున్నయి.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 1930లో డ్రగ్స్ ఎంక్వైరీ కమిటీ, అర్హులైన ఫార్మసిస్ట్ల (ఔషధ నిపునులు) పర్యవేక్షణలో ఔషధ వితరణ జరగాలని తెల్పింది. 1940లో డ్రగ్స్ ఆక్ట్, 1948లో ఫార్మసీ చట్టం ప్రకారం అర్హులైన ఫార్మసిస్ట్ల (ఔషధ నిపునులు) నుండి హేతుబద్దమైన, నాణ్యమైన ఔషధాలు తీసుకోవాలి అని సూచించింది. ఫార్మసీలలో అర్హత లేని వారు ఉండటం వలన ప్రజలు ఆరోగ్యపరంగా,ఆర్థికంగా మరింత నష్టపోతున్నారు.
మందులు పనిచేయకపోతే..
యాంటీబయాటిక్స్ నిరోధకత పెంచుకుని, మొండిగా తయారవుతుం డటంతో ఇప్పుడు చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పని చెయ్యకుండా పోతున్నాయి. చిన్నాచితకా జబ్బులకు కూడా మందులేకపోతే మనం ఏమవుతాం? అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని తీవ్ర విపత్తుగా గుర్తించి, రెండేళ్ల పాటు వివిధ దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకంపై క్షుణ్ణంగా సర్వే చేసి 114 దేశాల వివరాలతో తొలిసారిగా ఒక సమగ్ర నివేదిక వెలువరించింది. ప్రస్తుతం మన ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న యాంటీబయాటిక్స్ అన్నీ సూక్ష్మక్రిముల ముందు చిత్త్తెపోతుండటంతో మున్ముందు పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెంబేలెత్తిపోతోంది.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్
వైద్యచరిత్రలో మొట్టమొదటి యాంటీబయాటిక్ 'పెన్సిలిన్'ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో కనుగొన్నాడు. ఆ తర్వాత 1987 వరకూ దాదాపు 100 రకాల యాంటిబయాటిక్స్ కనుగొన్నారు. వీటి వాడకంతో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు అదుపులోకి వచ్చాయి. ఎన్నో ప్రాణాంతక వ్యాధులు నయమయ్యాయి.
మన శరీరంలో దాదాపు 1 కోటి కోట్ల జీవ కణాలుంటే, దానికి పదింతలు ఎక్కువగా10 కోటి కోట్ల బ్యాక్టీరియా కూడా మనలోనే ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో, చర్మం మీద, ముక్కులో, నోట్లో, ఊపిరితిత్తుల్లో.. ఇలా చాలా శరీరభాగాల్లో స్థిర నివాసం ఉంటాయి. ఇవన్నీ చెడ్డవే కాదు. వీటిలో మనకు సాయం చేసేవీ, హాని కారక క్రిముల నుంచి మనల్ని కాపాడేవీ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మన లోని రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేలా శిక్షణ కూడా ఇస్తుంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం. అయితే మనం యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు, కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అందుకే విరేచనాల వంటి రకరకాల దుష్ప్రభావాలు సంభవిస్తాయి. కానీ కాలక్రమేణా ఈ మందుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడే బలాన్ని సూక్ష్మక్రిములు పుంజుకున్నాయి. దాంతో వ్యాధులు తగ్గుముఖం పట్టకుండా మందులకు ఎదురుతిరగటం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో 'యాంటీబయాటిక్ రెసిస్టెన్స్' అంటారు.
ప్రస్తుతం ఈ సమస్య ప్రపంచ దేశాలన్నిటినీ పట్టి పీడిస్తోంది. దీన్ని సత్వరమే పరిష్కరించుకోకపోతే చిన్న చిన్న గాయాలతోనే ప్రాణాలు పోగొట్టుకునే శతాబ్దాల కిందటి పరిస్థితి పునరావృత్తమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో యాంటీబయాటిక్ నిరోధకత ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించటంతో బలం పుంజుకున్న సూక్ష్మక్రిములను చంపే సమర్థవంత మైన యాంటీబయాటిక్స్ను కనుగొనే దిశగా పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పరిశోధనల్లో భాగంగా టీక్సోబాక్టిన్ అనే యాంటిబయాటిక్ కనుగొన్నారు.
నిరోధకత సాధ్యమా?
యాంటీబయాటిక్స్ వాడకుండా నిరోధించడం సాధ్యమా అన్నది ఇప్పుడున్న అతి పెద్ద సమస్య. నిరోధించలేకేపోయినా.. అతిగా వేసుకోవడాన్ని నివారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రధానంగా మూడు కారణాలతో అతిగా యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు.
అవసరం లేకపోయినా
బ్యాక్టీరియా, వైరస్ ఈ రెండు రకాల సూక్ష్మజీవులే అన్ని రకాల వ్యాధులకు కారణం. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. వైరల్ ఇన్ఫెక్షన్లను యాంటీబయాటిక్స్ ఏమాత్రం అదుపు చేయలేవు. ఈ విషయం తెలియక వైరల్ ఇన్ఫెక్షన్ లైన జలుబు, ఫ్లూలకు యాంటీ బయాటిక్స్ వాడేస్తుంటాం. ఇలా వాడటం వల్ల వైరస్ నశించకపోగా శరీరంలోని చెడు బ్యాక్టీరియా బలం పెరుగుతుంది.
అపరిమితంగా వాడటం
చికిత్స కాలాన్ని, మందుల మోతాదును తగ్గించేయటం బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరగటానికి మరో ప్రధాన కారణం. అంటే వ్యాధిని నయం చేయటానికి వైద్యులు రోజుకి రెండు లేదా మూడు మాత్రల చొప్పున పరిమిత కాలంపాటు వాడాలని సూచి స్తారు. కానీ మనం ఆ మోతాదుతో పాటు మాత్రల సంఖ్యని కూడా తగ్గిస్తుంటాం. దాంతో బ్యాక్టీరియాను చంపేంత శక్తి ఆ మందులకు లేకపోవడంతో బ్యాక్టీరియా బలాన్ని, సంఖ్యను పెంచుకుంటూ వ్యాధి మరింత ముదిరిపోయేలా చేస్తుంది.
జంతువులకిచ్చేవి..
పశువులు, కోళ్లు, మేకల్లో వచ్చే బ్యాక్టీరియా సంబంధ వ్యాధులకు కూడా యాంటీబయాటిక్ మందులనే వైద్యులు సూచిస్తారు. వీటి వాడకంలో నియమాలు పాటించకపో వడం వల్ల వాటిలో కూడా బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఆ జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం వల్ల లేదా వాటి మలాన్ని ఎరువుగా ఉపయోగించి పండించిన కూరగాయలు తినడం వల్ల అదే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
మానవాళికే హాని
యాంటీబయాటిక్స్ అనేవి వరాలు. వైద్యపరిశోధనా రంగం ఎంతో కష్టపడి ఈ విలువైన అస్త్రాలను ఆవిష్కరించింది. వీటిని వైద్యులు, తల్లిదండ్రులు విచ్చలవిడిగా వాడేస్తే మనకూ, మొత్తం మానవాళికే హాని జరుగుతుంది. ఎందుకంటే 1970-80లలో కనుగొన్న, ఉత్పత్తి అయిన, మార్కెట్లోకి వచ్చినన్ని యాంటీబయాటిక్స్ ఇప్పుడు రావటం లేదు. కొత్తగా వచ్చే అస్త్రాలు లేవు... పాతవి పని చేయటం లేదు! అందుకే మనం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడైనా మేలుకోకపోతే తిరిగి పాత కాలానికి.. అంటే అప్పటిలా వేలు, లక్షల మంది ఇన్ఫెక్షన్ల పాలబడి మ త్యువాతపడే దుర్భర పరిస్థితులకు వెళ్లిపోతామని గుర్తించాలి!
టీకా ఉత్తమం
జబ్బులు వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడే కంటే టీకాలు అందుబాటు లో ఉన్న వ్యాధులకు ముందుగానే టీకా వేసుకుంటే ఉత్తమం. ఫ్లూ, న్యుమోనియా, రోటా వ్కెరల్ డయేరియా, డిప్థీరియా, కోరింతదగ్గు, టైఫాయిడ్, మీజిల్స్ వంటి వాటన్నింటికీ ఇప్పుడు టీకాలున్నాయి. వాటిని ముందే ఇవ్వటం మంచిది. చేతి శుభ్రత, నీటి శుభ్రత, ఆహార శుభ్రత, టీకాలు, చక్కటి పోషకాహారం.. ఇవన్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా కీలకమైనవి. దీనివల్ల మనం యాంటీ బయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం బాగా తగ్గుతుంది.
Authorization