వాతావరణంలో మార్పులు , పెరుగుతున్న కాలుష్యం మెదడుపై ప్రభావం చూపించడమే కాదు కొన్నిరకాల వ్యాధులకు కారణం అవుతుంది. అందులో పార్కిన్సన్స్ వ్యాధి ఒకటి. ఈ న్యూరో డిసీజ్తో మనదేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పూర్తి నివారణ సాధ్యం కాని ఈ జబ్బుబారిన పడకుండా ఉండాలంటే సరైన వ్యాయామం, ఆహారంతో పాటు కాలుష్యరహిత వాతావరణం ఎంతో ముఖ్యం..
పార్కిన్సన్స్ ఒకరకమైన న్యూరో డీజనరేటివ్ డిసీజ్. ఈ జబ్బు వచ్చిన వారిలో మెదడులోని సబ్స్టాన్షియానైగ్రా భాగం దెబ్బతినడం వల్ల న్యూరో ట్రాన్మీటర్ డోపమైన్ స్థాయిలు క్రమేణా క్షీణిస్తాయి. అరవైఏండ్లు దాటిన వారిలో ముఖ్యంగా మగవారిలో ఈ జబ్బు వస్తుంది. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి.
కారణాలు..
మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బతినటం, క్షీణించటం కారణంగా ఈ జబ్బు వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని ఉత్పత్తి చేసే నాడీ కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది.
పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాధమిక కారణాలను మాత్రం గుర్తించగలిగారు. కొందరిలో జన్యుపరమైన కారణాలతో వస్తుంది. అయితే చాలామందిలో వాతావరణ కాలుష్యం, పరిసరాలలోని రసాయనాలు మెదడులోని నాణీకణాలపై ప్రభావం చూపించి డోపమైన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఆహార పంటలపై చీడ పీడలను అదుపుచేయటానికి వాడే క్రిమి సంహారక మందుల అవశేషాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరటం వల్ల మెదడులోని డొపమైన్ను ఉత్పిత్తి చేసే నాడీ కణాలు చనిపోతున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. డోపమైన్ లోపం సహజంగానే వణుకుడు వ్యాధికి దారితీస్తుంది. వయసుపై బడటం మరో ముఖ్యకారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా అరవై ఏళ్లు దాటిన వారే ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వణుకుడు వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది.
లక్షణాలు..
ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా మొదలై రానురాను పెరుగుతుంటాయి. ఈ జబ్బు మొదటి దశలో శారీరక కదలికలు నెమ్మది అవుతాయి. నడకలోనూ మార్పులు వస్తాయి. నెమ్మదిగా చిన్నచిన్న అడుగులతో శరీరాన్ని ముందుకు వంచి నడుస్తారు. ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. శరీరం కాస్త వంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా, బిగుతుగా మారతాయి. వ్యాధి ముదరుతుండ టంతో చేతివేళ్లు వణుకుతాయి. ఆ తర్వాత కాళ్లకు వణుకు వస్తుంది. ఏ పనీచేయకుండా ఉన్నా... చేతివేళ్లు, కాళ్లుచేతులు సెకనుకు నాలుగైదు సార్లు వణుకుతుంటాయి. కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవటం చాలా ఇబ్బందికరం అవుతుంది. జబ్బు పెరుగుతున్నప్పుడు నడక మధ్యలో అనుకోకుండా (ఫ్రీజ్) ఆగిపోవడం, శరీరాన్ని అదుపు చేసుకోలేక పడిపోవడం, దెబ్బలు తగలడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి తన అవయవాలపై అదుపుకోల్పోతు న్నట్లు గుర్తించగలుగుతారు.
మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతారు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది.
వ్యాధి ప్రారంభంలో ఆహార పదార్థాల రుచి, వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. రుచిని, వాసన గుర్తించలేని స్థితిలో ఆహారం తినాలనిపించదు. ఈ రకమైన లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70 శాతం మందికి సంబంధించి అవి పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ లక్షణాలు అన్న విషయం తెలియదు. ఈ దశలోనే చికిత్స ప్రారంభిస్తే వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చు.
నిర్ధారణ..
ఈ వ్యాధిని నిర్ధారించేందుకు ఫిజికల్ ఎగ్జామినేషన్, కొన్ని క్లినికల్ పరీక్షలు అవసరమవుతాయి. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులోని ఇతర భాగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అన్న అంశాన్ని నిర్ధారించడానికి బ్రెయిన్ స్కాన్, ఎం.ఆర్.ఐ. వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
చికిత్స..
రోగి స్థితిని రెండు రకాలుగా చెప్పవచ్చు...
ఆన్ స్టేట్.. అంటే వ్యాధి లక్షణాలు తగ్గి శారీరక కదలికలు సాధారణ స్థితికి రావడం..
ఆఫ్ స్టేట్.. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం. ఒకరోజులోనే అనేక సార్లు ఆన్..ఆఫ్ స్టేట్లు రావడం జరుగుతుంది.
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వ్యాధి తీవ్రం కాక ముందే సరైన సమయంలో స్పందిస్తే కొంత మేరకు చికిత్స చేసేవీలుంటుంది. ప్రస్తుతం చికిత్స ద్వారా దీనిని అదుపుచేయడం సాధ్యమ వుతుంది. అయితే పూర్తిగా వ్యాధిని తగ్గించలేం. ముందుగా నివారించలేం.
ఈ వ్యాధి బారిన పడినవారు చికిత్స ద్వారా తమను వేధిస్తున్న లక్షణాలను అదుపుచేసుకొని సాధారణ జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. సరైన వ్యాయామం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో లక్షణాలను అదుపు చేయవచ్చు.
మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సాయపడుతూ డొపమైన్ ఉత్పత్తి జరిగేట్లు చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. శక్తివంతమైన ఈ మందులను డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి.. దీంతో అవయవాలు బిగుసుకుపోవటం, వణుకుడు తగ్గుతుంది.
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా..
పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించినంత వరకు డి.బి.ఎస్.(డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్ర చికిత్స. పార్కిన్సన్ వ్యాధి పెరుగుదల నిరోధించటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సర్జరీ ద్వారా మెదడులో వ్యాధికి గురైన భాగాలల్లో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎం.ఆర్.ఐ., సి.టి.స్కాన్ ద్వారా వ్యాధిగ్రస్థుల మెదడులో సమస్య ఎక్కడ ఉందో ముందుగానే గుర్తిస్తారు. ఆ తర్వాత చిన్న ఎలక్ట్రోడ్ ను అమర్చి వాటి తీగలను ఛాతి పై భాగంలో బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. ఈ విధానం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
Authorization