గుండె వైఫల్యం చెందడానికి అతి ముఖ్యమైన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటు బారిన పడిన వారిలో నూటికి 60మందికి గుండె వైఫల్యం వచ్చే ప్రమాదముంది. అయితే ఇదొక్కటే కాదు. తీర్ఘకాలం పాటు హైబీపీ తో బాధపడటం, నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని వైఫల్యం చెందుతుంది. అలాగే మధుమేహం నియంత్రణలో లేకపోయినా సూక్ష్మరక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా గుండెవైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బులున్నవారి శరీరంలో విషతుల్యాల ప్రభావం పెరిగి, క్రమేపి గుండె దెబ్బతింటుంది. అరుదుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్న వారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు అలాగే జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూలేనంతటి తీవ్రమైన ఒత్తిడి బారిన పడిన వారికి కూడా హఠాత్తుగా గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది.
గుండె వైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్ఛితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ఇసీజీ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా? గుండె గదులు పెద్దగా అయ్యాయా? కండరం మందంగా మారిందా? వంటి వివరాలన్నీ బయటపడతాయి. ఎకో పరీక్ష ద్వారా గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది. ఇవి కాకుండా గుండె వైఫల్యం లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు 'యాంజియోగ్రామ్' అవసరమవుతుంది. 99శాతం మందికి ఈ పరీక్షల తోనే గుండెవైఫల్యం కచ్ఛితంగా నిర్ధారణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టం కోసం ఎంఆర్ఐ, పెట్స్కాన్ వంటి పరీక్షలు అవసరం అవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండెవైఫల్యమా? లేక ఉబ్బసమా? అన్నది తెలుసుకునేందు కు 'బీఎన్పీ' రక్తపరీక్ష ఉపకరిస్తుంది.
చికిత్స
గుండెవైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండెసైజు పెరగడం గుండె కండరాలు మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. గుండె వ్యాధి ముదర కుండా చూడటానికి మందులు వాడాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్నిరకాల మందులు వాడాల్సి ఉంటుంది. వీటికి తోడు గుండెసైజు పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు డాక్టర్ పర్యవేక్షణలో మరికొన్ని మందులు వేసుకోవాలి. అలాగే శరీరంలో అధికంగా చేరిన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపేందుకు డైయారీటిక్స్ మందులు, లక్షణాలు తగ్గేందుకు డిజిటాయిల్స్ మందులు ఉపయోగపడుతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ జీవనకాలం పెరగడానికి తోడ్పతాయి.
గుండె పంపింగ్ సామర్థ్యం 30శాతం కంటె తక్కువగా ఉన్న వారికి కొన్నిరకాల మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా ఉన్నవారు ఎక్కువ మోతాదు మందులను తట్టుకోలేరు. వారికోసం ప్రత్యేకమైన మందులు వాడాలి. అలాగే కిడ్నీ సమస్యలున్నవారు ముందుగానే తమ సమస్యలను డాక్టర్కు చెప్పాలి. వారికి మరోరకమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండెవైఫల్యం అరికట్టే మందులు రక్తనాళాలు విప్పారేలా చేస్తూ గుండెమీద భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గటమే కాకుండా గుండెవైఫల్యం కారణంగా తలెత్తే సమస్యలూ తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను పద్దతి ప్రకారం వేసుకోవడం చాలా ముఖ్యం. ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా డాక్టర్కు చెప్పాలి. అప్పుడే సరైన మందులు సూచించడం వీలైతుంది.
Authorization