భోజనం చేసే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలని కొందరు, తాగవద్దని మరికొందరు అంటారు. ఏది నిజమో, ఆరోగ్యానికి మంచిదో తెలియక చాలా మంది తమ అలవాటు ప్రకారమే నీళ్లు తాగు తుంటారు. మరి నిజానికి ఆహారం తింటూ నీళ్లు తాగవచ్చా? లేదా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. భోంచేస్తున్నప్పుడు చెంబులకొద్దీ నీళ్లు తాగాలి అనిపించడానికి కారణం.. మిగతా సమయాల్లో సరిగ్గా నీళ్లు తాగకపోవడమే. శరీరంలో నీరు కరువైతే భోజన సమయంలో నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం సరిపోదు. దీంతో, ఇంకొన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది. అలాగే భోజనంలో సాంబారు, రసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాల్సిన అవసరం రాదు. వంటలో ఉప్పు, కారం అధికంగా ఉంటే కూడా.. ముద్దముద్దకూ నీళ్లు తాగాలనిపిస్తుంది. తినేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగడం వల్ల నష్టమేమీ ఉండదు. మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఇబ్బందే. జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యుట్ కావడం వల్ల ఆహారం ఆలస్యమయ్యే జీర్ణం అవుతుంది. భోజనానికి ఓ అరగంట ముందే కొన్నినీళ్లు తాగితే సరిపోతుంది. అలాగే తిన్న తర్వాత కూడా అరగంట సమయమిచ్చి తాగితే మంచిది.