తలమీద సుత్తితో బాదుతున్నట్లు అనిపించడం, తలంతా నొప్పి, కండ్లు మూతలు పడుతుండటం వంటివి మైగ్రెయిన్ లక్షణాలు. ఈ బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొందరు పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు. అయితే ఎక్కువగా వీటిని వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మైగ్రెయిన్ కారణంగా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే అల్లం మైగ్రెయిన్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం కూడా కొన్నిసార్లు అసౌకర్యానికి, తలనొప్పి పెరగడానికి కారణం అవుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు లైట్లను ఆఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఉపశమనం కలుగుతుంది. మైగ్రెయిన్ నొప్పిని తగ్గించే మరో తేలికైన పద్ధతి మసాజ్. తలనొప్పి బాధపెడుతున్నప్పుడు మెడ, తల భాగాన్ని మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి పెయిన్ తగ్గుతుంది. నిద్రలోకి జారుకుంటే చాలావరకు రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా తగ్గుతుంది. కెఫిన్ ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నొప్పి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.