భానుడి వేడిసెగల నుంచి ఉపశనం కలిగేలా చిరుజల్లులు కురుస్తున్నాయి. చినుకుల్లో ఆనందంతో పాటు అనారోగ్యాన్ని తీసుకువచ్చే అనేక సూక్ష్మజీవులు శరీరంలోకి చేరుతాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. తొలకరి జల్లులు పడే సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అయితే బయటి చిరుతిండ్లకు, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండండి. ఇంట్లోనే వేడివేడిగా మీకు ఇష్టమైనవి చేసుకోండి. నిన్నమొన్నటివరకు వాతవరణం వేడిగా ఉండటంతో చాలావరకు చల్లటి నీరు స్నానానికి, తాగడానికి ఉపయోగించి ఉంటారు. కానీ, చినుకులు పడేవేళ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యకరం. టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీ , సూపులు తాగితే మంచిది. తినే పదార్థాలను వేడి వేడిగా ఉండేలా చూసుకొండి, అవసరమైతే ఏ పూట వంట ఆ పూటే చేసుకోవాలి. దోమలు పెరిగే వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించండి. ఇంట్లో కానీ, మన చుట్టు పక్కల కానీ నీటిని నిల్వ ఉండకుండా చూసుకోండి. ఈగలు,బొద్దింకలు ఇంట్లో లేకుండా చూసుకోండి. చికెన్,మటన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా ఉడికించిన తర్వాతే తినండి. వర్షంలో తడవకుండా జాగ్రత్త పడండి.