నిన్నా మొన్నటి వరకు ఉక్కపోతతో, వేసవి తాపంతో అల్లాడిన మనం ఇప్పడిప్పుడే చినుకుల సవ్వడితో కాస్త సేదతీరుతున్నాం. అయితే వాతావరణం ఒక్కసారిగా వచ్చే మార్పు కొన్ని అనర్థాలకు దారితీస్తుంది. అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఈ సమయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఆసుపత్రుల బాట పట్టాల్సిందే. ముఖ్యంగా తాగేనీరు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే సమస్యలు మరింత ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో అతి వేగంగా వ్యాపించే వ్యాధి డయేరియా. దీనినే అతిసార వ్యాధి అంటారు. ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రాణాలను హరిస్తుంది. తొలిదశలో గుర్తించి తగిన వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలల్లో
మరణానికి కారణమయ్యే వ్యాధుల్లో ఇది ఒకటి. సీజనల్గా వచ్చే
ఈ వ్యాధిపై అవగాహన ఎంతైన అవసరం.
చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధులన్నింటిలోను దాదాపు 60-70 శాతం కేవలం డయేరియా వల్లే వస్తాయి. అంతేకాదు చిన్నారుల ప్రాణాలు తీయడంతో డయేరియా మొదటిస్థానంలో ఉంది. చిన్నపిల్లలే కాదు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో మరణించిన పెద్దవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే.
కారణాలు..
పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. కలుషితమైన నీరు తాగడం, అపరిశుభ్రమైన ఆహారం తినడం, వ్యక్తిగత శుభ్రత పాటించక పోవడం వల్ల డయేరియా వస్తుంది. ఈ వ్యాధికి కారకాలు ముఖ్యంగా రోటా వైరస్ అనే అతి సూక్ష్మ జీవులు, ఇతర బ్యాక్టీరియాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరిశుభ్రమైన నీరు లభించకపోవడం ముఖ్య కారణాలు.
లక్షణాలు
డయేరియా తొలిదశలో వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరంలోని లవణాలను కోల్పోయి, నీరసంగా తయారవుతారు.
- పిల్లల్లో విరేచనాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే వారి ప్రాణానికే ప్రమాదకరం.
- డయేరియాలో మరో ముఖ్య లక్షణం డీ హైడ్రేషన్. అంటే శరీరంలోని నీటి శాతాన్ని కోల్పోవడం.
- విరేచనాలతో పాటు జ్వరం, కళ్లు లోపలికి వెళ్లడం, చర్మం సాగే గుణం కోల్పోవడం, గొంతు బొంగురుగా మార డం, వేగంగా ఊపిరి పీల్చడం, వాంతుల కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయి.
- విరేచనానికి వెళ్లే ముందు తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది.
- దాహం తీవ్రమై, నోరు తడారిపోతుంది.
- డీ హైడ్రేషన్ ఎక్కువైన కొద్దీ పిల్లల నాడి వేగం తగ్గి, స్ప హ కోల్పోతారు. పిల్లలు, వృద్ధులు ఈ సమస్య బారిన పడితే కోలుకోవడం చాలా కష్టం.
- మూత్ర విసర్జన చాలావరకూ తగ్గిపోతుంది. ఈ సమస్య ప్రారంభంలో జ్వరంతో బాటు వాంతులూ ఉంటాయి. ఈ సమస్య వచ్చినవారు వీలున్నంత వరకూ నీరు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, గ్లూకోజ్ వంటివి అధికంగా తీసుకోవాలి.
నిర్ధారణ
డయేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. రక్తంలో లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వ్యాధి నిర్ధారణలో భాగంగా పరిశీలిస్తారు.
చికిత్స
శుభ్రమైన నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ తాగడం చాలా మంచిది. వాంతుల వల్ల నీరు తాగలేకపోతే సెలైన్ ఎక్కిం చాలి. తగినంత విశ్రాంతి ఇస్తూ అవసరమైన మాత్రలు వాడాలి.
వాంతులు, విరేచనాలు ఆగడానికి డాక్టర్ సూచన మేరకు మందులు వాడాలి. కొన్నిసార్లు సమస్య తగ్గినట్టు అనిపించినా పూర్తిగా తగ్గదు. పేగులలోని వ్యర్ధాలు లోపలే ఉండి, ఒక్కసారిగా తీవ్రతతో కూడిన విరేచనాలు కావచ్చు. అప్పటికప్పుడు అయ్యే వాంతులు, విరేచనాల విషయంలో కంగారు పడకుండా సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, గ్లూకోజ్, మజ్జిగ వంటివి తీసుకోవాలి.
విరేచనాల్లో రక్తం, జిగురు లాంటివి కనిపించిన సందర్భంలోనూ, ఒకటి, రెండు రోజులైనా విరేచనాలు, వాంతులు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు
ఉప్పు, పంచదార కలిపిన నీరు, ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రోల్ పొడి కలిపిన నీరు తాగాలి. ఈ ఎలక్ట్రోల్ పొడిని అవసరమైనప్పు డల్లా చెంచా చొప్పున నీటిలో కలుపుకోవటం కంటే ఒకేసారి లీటరు నీటిలో మొత్తం ప్యాకెట్ పొడినీ కలిపి, రోజంతా అప్పుడప్పుడు ఒక్కోగ్లాసు తాగడం మంచిది.
తల్లిపాలు, పోతపాలు తాగే పిల్లలకు ఎప్పటిలాగే పాలివ్వాలి.
వాంతులు, విరేచనాలతో బాధపడేవారు తేలికపాటి ఆహారంతోపాటు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
వాంతులు తగ్గినా, ఉప్పు వేసిన మజ్జిగ, కొబ్బరినీరు, గంజి, సగ్గుబియ్యం జావ, క్యారెట్సూప్ వంటివి ఇవ్వాలి.
బయట అమ్మే పండ్ల రసాలు, కూల్ డ్రింకులు, ఐస్ కలిపిన పానీయాలు ఎట్టిపరిస్థితిల్లోనూ తాగకూడదు.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగి వాడాలి.
వాంతులు తగ్గిన తర్వాత ఇడ్లీ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన తర్వాత తప్పక సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారంపైనా ఈగల వాలకుండా మూతలు ఉంచాలి.
బహిరంగ మలవిసర్జన చేయకూడదు.
చెరువులు, బావులు, బోర్ల వద్ద బట్టలు ఉతకవద్దు.
ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలి.
డయేరియా నిరోధానికి వ్యాక్సిన్!
రోటా వైరల్ డయేరియా వల్ల చిన్నపిల్లలు చనిపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డయేరియా వల్ల ఏడాదిలోపు వయసున్న ప్రాణాపాయం కూడా ఎక్కువే ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ఒకసారి విరేచనం అయితే మృత్యువాత పడే అవకాశం ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి వాక్సినేషన్ ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చు.
పరిశుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, విటమిన్ ఎ సప్లిమెంటేషన్ల వల్ల ఇన్ఫెక్షన్ రిస్కు తగ్గుతుంది. . నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో భాగంగా రోటావైరస్ వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో ఉపయోగిస్తున్నారు. యుఎస్, యుకెల్లో అయితే రోటావైరస్ పూర్తిగా తొలగిపోయింది. మెక్సికోలో 50 శాతం వరకు వ్యాధి ప్రభావం తగ్గిపోయింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 6 వారాల వయసున్న పిల్లల నుంచి ఉచితంగా అందిస్తారు. ఈ వ్యాక్సిన్ని 6, 10, 14 వారాల వయసులో 5 చుక్కల చొప్పున వేస్తారు. అయితే అన్ని రకాల డయేరియాలను ఈ వ్యాక్సిన్ నివారించలేదు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వేరే రకాలైన అంటే బాక్టీరియా వల్ల కలిగే డయేరియా లాంటివి రావొచ్చు. కొందరిలో వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత దగ్గు, వాంతులు, విరేచనాలు, ముక్కు కారడం, జ్వరం, దద్దుర్ల లాంటివి తాత్కాలికంగా కనిపించవచ్చు. రోటావైరస్ డయేరియా వల్ల కలిగే ప్రాణాంతకమైన నష్టాల కన్నా రోటావైరస్ వ్యాక్సిన్ వల్ల కలిగే నష్టం పెద్దగా ఉండదు. కాబట్టి సైడ్ ఎఫెక్టుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
- డాక్టర్ స్వామి అల్వాల్,
ఎం.బి.బిఎస్(ఉస్మానియా), ఎండీ(నేచరోపతి)
సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీజీహెచ్ఎస్(రిటైర్డ్)
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization