మన శరీరానికి రక్తం అవసరం అన్నది అందరికీ తెలిసిందే. ప్రతికణాన్ని ఉత్తేజితం చేసే రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది, మరికొందరిలో ప్రమాదాల కారణంగా తక్కువైతుంది. ఇలాంటి వారి ప్రాణాలు కాపాడాలంటే ఆరోగ్యవంతులైన వారి నుంచి రక్తం సేకరించాలి. అందుకే 'రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి' అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చి ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ సరైన అవగాహన లేనికారణంగా రక్తదాతల సంఖ్య తక్కువగానే ఉంది. అనేక మంది సరైన సమయంలో రక్తం అందక మరణిస్తున్నారు. రక్తదానం చేయడం వల్ల దాతకు ఆరోగ్యం, గ్రహీతకు ప్రాణం దక్కుతుంది అన్న అంశంపై ప్రతిఒక్కరిలో అవగాహన రావాలి.
ప్రతి రెండు సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి ఎందుకు కలుగుతుంది? ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు, రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తం అవసరం అవుతుంది. రక్తంలో 90 శాతం నీరు, 10శాతం పోషకాలు, హార్మోన్లు మొదలగు వాటితో నిండి ఉంటుంది. ప్రాణాధారమైన రక్తాన్ని కృత్రిమంగా తయారుచేయలేం. ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి సేకరించిన రక్తాన్ని మాత్రమే అవసరమైన వారికి ఎక్కిస్తారు. ప్రతి ఏటా మనదేశంలో డిమాండ్కు తగ్గట్టుగా రక్తం అందుబాటులో లేకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రక్తదానం ఎవరు చేయవచ్చు...?
రక్తం ఇచ్చేవారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు.
ఆరోగ్యంగా ఉన్న18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు.
యాభై కేజీల బరువు, 12.5 గ్రాముల హీమోగ్లోబిన్ ఉన్నవారు.
జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు.
ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరునెలల, మగవారైతే మూడునెలల తర్వాత రక్తాన్ని రెండవసారి ఇవ్వవచ్చు.
రక్తదానం చేయడానికి 48గంటల ముందు ఎలాంటి మందులు వేసుకోవద్దు
రక్తదానం వీరు చేయవద్దు...
మత్తు మందులకు అలవాటు పడినవారు, హైపటైటీస్ బి, సి, హెచ్ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారు రక్తదానానికి అనర్హులు.
రక్తపోటు, మధుమేహం అదుపులో లేనివారు రక్తదానం చేయవద్దు.
ఫిట్స్, గుండెజబ్బు, కాన్సర్ వ్యాధి ఉన్నప్పుడు.
ఆరునెలల క్రితమే రక్తం ఎక్కించుకున్న వారినుండి రక్తం తీసుకోరు.
గత మూడేండ్లల్లో హెపటైటిస్, కామెర్లు, మలేరియాతో బాధపడిన వారు
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు.
ముగ్గురికి ప్రాణదానం...
ఒక యూనిట్ రక్తం (300-450) మిల్లీలీటర్ రక్తాన్ని మూడు బాగాలుగా విభజించి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు రక్తంలోని ఎర్రరక్తకణాలను ఒక రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తికి లేదా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఉపయోగిస్తారు. రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని హీమోఫిలియా అనే బ్లీడింగ్ డిజార్డర్ వ్యాధితోనున్న వ్యక్తికి ఉపయోగిస్తారు. ప్లేట్లెట్స్ను డెంగ్యు వంటి ప్రాణాంతక జ్వరంతోనున్న వ్యక్తికి లేదా థ్రోంబోసైటీమియా వంటి వ్యాధితో నున్న వ్యక్తికి ఉపయోగిస్తారు. ఒక యూనిట్ రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడే వీలు కలుగుతుంది.
ప్రయోజనాలు...
రక్తదానం చేయడం వల్ల గ్రహీత ప్రాణాలు కాపాడంతో పాటు దాత ఆరోగ్యం గురించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది.
రక్తందానం చేయడానికి ముందు, దాత పూర్తి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటారు. అంతేకాదు, ఆ వ్యక్తి రక్తందానం చేయడానికి అర్హుడా కాడా అన్నవిషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్య సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది.
శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడంవల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడంవల్ల క్యాన్సర్తో బారిన పడే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.
రక్తదానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.
శరీరంలోని రక్తకణాల్లో కొలెస్టరాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్టరాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.
రక్తదానం చేసినప్పుడు నీరసం వస్తుంది. శరీరంలో రక్తం తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటారు. ఇది నిజం కాదు. రక్తదానం చేసిన వెంటనే పండ్లరసం తాగితే చాలు. ఇచ్చిన రక్తాన్ని భర్తీ చేయడం కోసం 4-8 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్రరక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్దరణ సరిచేస్తుంది. అయితే మీరు రక్తదానం చేసేటప్పుడు మీ డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి.
జాగ్రత్తలు..
రక్తాన్ని దానం చేసే కనీసం 3 గంటల ముందు మంచి భోజనాన్నితీసుకోండి.
దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
రక్త దానం చేసే రోజు కన్న ముందు రోజు నుంచే పొగత్రాగడం మానండి.
రక్త దానం చేయడానికి రెండురోజుల ముందు ఆల్కహాలు సేవించి ఉంటే, మీ రక్తం తీసుకోరు.
వాస్తవాలు...
రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు, కేశనాళికల ద్వారా ప్రసరించి ప్రాణాలను నిలబెడుతుంది.
శరీర బరువులో, రక్తం సుమారు ఏడు శాతం వరకు ఉంటుంది.
శరీర పోషణకి అవసరమైన విద్యుద్వాహక లవణాలు, హార్మోన్లని, విటమిన్లని, ప్రతి రక్షకణాలు, ఆక్సిజన్ రక్తం ద్వారా తీసుకువెళతాయి.
శరీరం నుండి వ్యర్థపదార్థాలని, కార్బన్ డై ఆక్సైడ్ ను రక్తం తీసుకువెళుతుంది.
వ్యాధులను ఎదుర్కొని, గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్తకణాలు శరీరం యొక్క ప్రాథమిక సురక్ష.
ఒక రకమైన తెల్ల రక్తకణాలైన గ్రాన్యులోకైట్స్, సూక్ష్మక్రిములను వెదికి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి.
అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది.
రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్తకణాలు ఉంటాయి.
ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి.
రక్త పట్టికలు రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి. లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి వీటిని ఇతరుల నుంచి సేకరించిన రక్తం నుంచి వేరుచేసి ఎక్కించడం వల్ల వారి జీవితకాలాన్ని పెంచుతాయి.
ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. గ్రహితలకు ప్రాణదానాన్ని, దాతలకు ఆరోగ్యాన్ని ఇచ్చే రక్తదానం ప్రతిఒకరూ చేయాలి. అప్పుడే అకాలమరణాలను కొంతైన తగ్గించే వీలు కలుగుతుంది.
రక్తదానం చేద్దాం - ప్రాణాలను కాపాడుదాం
కీమోథెరపీలోనూ..
మనుషులకు అవసరమైన రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమంటే ఓ ప్రాణాన్ని కాపాడడమే.
ఏటా మన దేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే.
ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరంఉంది.
అత్యధికంగా అవసరమయ్యే రక్తం ''ఒ'' గ్రూప్
రిజిస్ట్రేషన్, మెడికల్హిస్టరీ, డొనేషన్, రిఫ్రెష్మెంట్ అనే నాలుగు తేలికపాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది.
రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్, బీపీ, పల్స్, హిమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేస్తారు.
రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది.
మన శరీరంలో 10 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్ రక్తాన్ని దానం చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆరోగ్యవంతుడైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎర్ర రక్తకణాలను డొనేట్ చేయవచ్చు.
డొనేట్ చేసిన ప్లేట్లెట్స్ను సేకరించిన ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.
ఆరోగ్యవంతుడైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు.
రక్తదానం ద్వారా సేకరించిన రక్తానికి హెచ్ఐవీ, హెపటైటిస్, ఇతర అంటువ్యాధుల సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాతే దాన్నిఅవసరమైన వారికి ఎక్కిస్తారు.
రక్తం నుంచి ఎర్రరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్ అనే భాగాలను విడదీసి ఎవరికి ఏది అవసరమో వారికి అది అందిస్తారు. ఒక్కసారి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడవచ్చు.
దేశంలో ప్రతిఏటా కొత్తగా పది లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరికి కీమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.
Authorization