ఎండలు కాస్త తగ్గి వానలు పడే ఈ సీజన్లో వచ్చే అనారోగ్యసమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో జ్వరం రావడానికి ప్రధాన కారణం వైరస్, బ్యాక్టీరియాలు విజృంభించడమే..! అపరిశుభ్రత, దోమలు, ఈగలు, కీటకాలు.. ఇలా జ్వరాన్ని తెప్పించే సూక్ష్మజీవులు పరిసరాల అపరిశుభ్రత కారణంగా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యసమస్యలను కలిగిస్తాయి. ముందుగానే ఈ సీజన్లో వచ్చే జ్వరాలపై అవగాహన ఏర్పర్చుకోవడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
ఇతర కాలాలతో పోలిస్తే వానాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా ఉంటాయి. నిల్వ నీరు, అపరిశుభ్ర పరిసరాలు దోమలు, ఈగల్ని ఆకర్షిస్తాయి. ఎక్కువ శాతం జ్వరాలు ప్రధానంగా దోమల ద్వారానే వ్యాపిస్తాయి.
పగటివేళ కుట్టే దోమలతో..
డెంగ్యు వ్యాధిని కలిగించే దోమలు పగటి వేళ మాత్రమే కుడతాయి. డెంగ్యు అనే వైరస్ శరీరంలోకి చేరటం ద్వారా ఇది వస్తుంది.
లక్షణాలు..
డెంగ్యు జ్వరం వచ్చిన వారిలో విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండ్లు లాగటంలాంటి లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. మూడు రోజులపాటు ఈ లక్షణాలు అలాగే ఉంటాయి.
నాలుగో రోజు నుంచి క్రమంగా జ్వరంతో పాటు ఈ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి.
జ్వరం తగ్గిన తర్వాత రోగి రక్తంలోని ప్లేట్లెట్స్ శాతం తగ్గి రోగి నిరసంగా మారిపోతారు. ఈ స్థితిలో రోగికి సపోర్టివ్ కేర్ ఇచ్చి వ్యాధిని అదుపు చేసే వీలుంటుంది.
డెంగ్యు హెమరేజిక్ ఫీవర్..
ప్లేట్లెట్స్ తగ్గినా గమనించకకుండా చికిత్స తీసుకోకపోతే రక్తంలోని ద్రవాలు బయటకి స్రవించి రక్తం చిక్కబడుతుంది. ఇలాంటి స్థితినే డెంగ్యు హెమరేజిక్ ఫీవర్ అంటారు. ఈ స్థితి ఎంతో ప్రమాద కరమైనది. రోగి శరీరం మీద దద్దుర్లు కనిపిస్తాయి. కడుపునొప్పి, ఆయాసం ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ మాత్రమే తగ్గితే వాటిని ఎక్కించటం ద్వారా పరిస్థితిని చక్కదిద ్దవచ్చు. అలాకాకుండా రక్తం చిక్కబడితే ఆ ప్రభావంతో శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బ తింటాయి. ప్రధాన అవయవాలైన మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి. అయితే డెంగ్యు వచ్చిన రోగులందరూ ఇలాంటి ప్రమాదకర స్థాయికి చేరుకుంటారని చెప్ప లేం. సాధారణంగా 90 శాతం మందిలో విశ్రాంతి తీసుకుంటూ, జ్వరం తగ్గించే మాత్రలు వాడితే నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది. డెంగ్యు సోకిన వంద మందిలో ఇద్దరు మాత్రమే డెంగ్యు హెమరేజిక్ ఫీవర్ దశకు చేరు కుంటూ ఉంటారు. లక్షణాలు కనిపించగానే మెరుగైన వైద్యం తీసుకోవాలి.
పరీక్షలు
డెంగ్యు లక్షణాలతో వచ్చిన రోగికి వచ్చింది డెంగ్యు జ్వరమో కాదో తెలుసుకోవటం కోసం 'డెంగ్యు సిరాలజీ' అనే పరీక్ష చేస్తారు. ఎలీజా, ఎల్ఎస-వన్ అనే కిట్ పద్ధతులతో కూడా డెంగ్యు జ్వరాన్ని కనిపెట్టవచ్చు. ఈ కిట్ల సహాయంతో ఇంటి దగ్గరే డెంగ్యు జ్వరాన్ని గుర్తించే వీలుంది.
జాగ్రత్తలు
సాధారణంగా డెంగ్యు జ్వరం అని నిర్ధారణ కాగానే రోగులు కంగారుపడతారు. కానీ డెంగ్యు జ్వరం గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సపోర్టివ్ కేర్ తీసుకుంటూ డెంగ్యు జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.
ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డెంగ్యు జ్వరం ప్రభావం రక్తం మీద కనిపిస్తుంది. కాబట్టి రక్తం చిక్కబడకుండా ఉండేలా ఎక్కువ ద్రవాపదార్థాలు తీసుకోవాలి. రోగికి ఎక్కువగా విశ్రాంతి అవసరం. డెంగ్యూకు ఎటువంటి యాంటిబయాటిక్, స్టిరాయిడ్స్ మందులు వాడాల్సిన అవసరం లేదు. అయితే డెంగ్యు వైరస్ వల్ల కొందరిలో సెకండరీ ఇన్ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గిపోవటంతో ఇతరత్రా ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. అలాంటప్పుడు యాంటిబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తూ జ్వరం తగ్గించే మందులు వాడుతూ ఉంటే డెంగ్యు వైరస్ పూర్తిగా నశిస్తుంది. అలాగే రక్తంలో 1.5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20 వేల కంటే తగ్గితే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. రోగికి ఎక్కువగా ద్రవపదార్థాలు ఇస్తూ.. విశ్రాంతిఇస్తే తర్వగా కోలుకుంటారు.
రాత్రివేళ మాత్రమే కుట్టే దోమలతో..
మలేరియా కారక దోమలు రాత్రివేళ మాత్రమే కుడతాయి. మలేరియాలో నాలుగు రకాలున్నా మన ప్రాంతంలో వైవాక్స్, ఫాల్సిఫారం అనే రెండు రకాల మలేరియా కారక ప్యారసైట్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ రెండు రకాల మలేరియా జ్వరాలు దోమల వల్లే వచ్చినా వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో తేడాలుంటాయి. చికిత్స కూడా వేర్వేరుగా ఉంటుంది.
మలేరియా ఫాల్సిఫారంలో కాంప్లికేషన్స్ ఎక్కువ. కాబట్టి వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వేగవంతమైన చికిత్స అందించాలి. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్సను అందించడం ద్వారా మలేరియా జ్వరాన్ని తగ్గించవచ్చు.
జ్వరం, ఇన్ఫెక్షన్ 12 నుంచి 18 రోజులపాటు ఉంటుంది. చలిజ్వరం, తలనొప్పి, నీరసం, వాంతులు కనిపిస్తాయి. ఎర్ర రక్తకణాలు త్వరితంగా నశిస్తూ ఉంటాయి. ఈ రకమైన జర్వం తగ్గించడానికి వైద్యుల పర్యవేక్షణలో యాంటిబయాటిక్స్ వాడాలి.
ఈగలతో..
లెప్టోస్పైరోసిస్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే మరోరకమైన జ్వరం ఇది. పెంపుడు జంతువుల మల మూత్రాల ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. జంతువుల మల మూత్రాల మీద వాలిన ఈగలు ఆహారం మీద వాలినప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి చెంది అనారోగ్యానికి కారణమవుతుంది.
లక్షణాలు..
లెప్టోస్పైరోసిస్ వ్యాధిలో ఐదారు రోజులపాటు జ్వరం ఉంటుంది.
ఆ తర్వాత ఒంటి మీద దద్దుర్లు మొదలవుతాయి. తీవ్రమైన జ్వరం కారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరులో మార్పు వస్తుంది. కామెర్లు, కిడ్నీ ఫెయిల్యూర్లాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. సరైన సమయంలో ఈ బ్యాక్టీరియాను గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది
కలుషిత ఆహారంతో..
కలుషిత ఆహారం తినడం, నీరు తాగడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఇందుకు కారణం
సాల్మొనెల్లా టైఫై, సాల్మొనెల్లా పారాటైఫై అనే బ్యాక్టీరియా రకాలు. కలుషిత ఆహారంలో ఉండే ఈ బ్యాక్టీరియా రక్త ప్రవాహం ద్వారా కాలేయం, స్ప్లీన్, ఎముక మజ్జల్లోని తెల్ల రక్తకణాల్లోకి చేరుతుంది.
లక్షణాలు..
బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. విపరీతమైన జ్వరంతో బాధపడతారు. గాల్ బ్లాడర్, పొట్టలోని లింఫాటిక్ టిష్యూలోకి బ్యాక్టీరియా చేరుతుంది. 104 డిగ్రీలకు మించిన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించటం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
నిర్ధారణ..
ఈ వ్యాధిని మలం లేదా రక్తాన్ని పరీక్షించటం ద్వారా తేలికగా గుర్తించవచ్చు. సరైన సమయంలో డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. యాంటిబయాటిక్స్తో పూర్తిగా తగ్గించవచ్చు
శరీరం మీద దద్దుర్లతో..
వానాకాలంలో డెంగ్యుతో పాటు డెంగ్యుని పోలిన జ్వరం కూడా వస్తుంది. ముళ్లకంపలు, బురద, చెట్లు ఉన్న చోట ఎక్కువగా పెరిగే ఒక విధమైన పురుగు కాటుతో జ్వరం వస్తుంది. ఈ పురుగులు కుట్టడంతో శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా కారణంగా జ్వరం వస్తుంది.
లక్షణాలు..
శరీరం మీద దద్దుర్లు కనిపిస్తాయి. రోగికి పురుగు కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ మచ్చలు ముదురురంగు చర్మం మీద కనిపించకపోవచ్చు. ఐదారు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా శరీరం మీద మచ్చలు కనిపించి, రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గితే ఆ జ్వరాన్ని స్క్రబ్టైఫ్స్గా భావించి వైద్య చికిత్స తీసుకోవాలి. ఈ వ్యాధిని గుర్తించలేక చికిత్స తీసుకోవటం ఆలస్యమైతే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. అప్రమత్తంగా ఉండాలి.
Authorization