పాజిటివ్ థింకింగ్ మనిషిని ఒత్తిడి నుంచి దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచిని తలచుకున్నా మంచి జరుగుతుందని అధ్యయనాల ద్వారా స్పష్టం అవుతుంది. బాధగా ఉన్నప్పుడు జీవితంలోని సంతోషకరమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా మనసును ఉల్లాసవంతంగా మార్చుకోవచ్చు. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకని అనుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. 'మంచి' అనుభవాలను తలచుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తమ అధ్యయనాల ద్వారా స్పష్టమైందని వారు అంటున్నారు. మంచి విషయాలను గుర్తు చేసుకోవడం, ఇతరులతో చర్చించడం అలవాటుగా మలచుకుంటే ఒత్తిడి తగ్గుముఖం పడుతుందని.. ఫలితంగా భావోద్వేగాలు మెరుగు పడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు, గుండెజబ్బు, అధిక రక్తపోటు వంటి జీవనశైలీ కారణంగా వచ్చే జబ్బుల బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. మంచి అనుభవాలను నెమరు వేసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్ననాటి ఫొటోలను చూడటం, పచ్చటి ప్రకృతి మధ్యలో వేడి వేడి కాఫీ తాగటం, జోక్స్ చదవడం, చిన్నచిన్న బొమ్మలు వేయడం ఇలాంటి చిన్న చిన్న అనుభవాలైనా సరే. మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగించిన ఘటనలేవైనా చాలు. తరచుగా వాటిని నెమరు వేసుకోవటం మొదలెట్టండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గానీ రాత్రి పడుకోబోయే ముందు గానీ దీన్నొక అలవాటుగానూ మలచుకోవచ్చు. వీలైతే నోట్బుక్కులో రాసుకోవచ్చు కూడా. దీని మూలంగా మనసులో సానుకూల భావాలు ఉప్పొంగుతాయి. ఇవి ఒత్తిడిని తట్టుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. నిజానికి మనకు పెద్ద పెద్ద ఒత్తిళ్లే ఎదురవ్వాల్సిన పనిలేదు. రోజువారీ పనులతోనూ ఎంతోకొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకు మంచి విషయాలు అంతగా గుర్తుకురావు. ఇది మరింత ఒత్తిడికి, విచారానికి దారితీసి.. ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతుంది. మంచి అనుభవాలను నెమరు వేసుకునే అలవాటు దీనికి విరుగుడుగా ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.