నేటి ఆధునిక యుగంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. దాంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే నగర వాసులు గాలి కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యపు విషకోరుల్లో చిక్కకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గాలితో ఆక్సిజన్ శాతం తగ్గడంతో ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఆస్తమా, క్షయ వ్యాధులకు ఇది ప్రధానకారణం అవుతుంది. వీటిలో పాటు గుండెపోటు, పక్షవాతం రావడానికి కూడా కాలుష్యం కారణం అవుతుంది. ఇటీవల జరిగిన పరిశోధనల ద్వారా మతిమరుపులాంటి సమస్య బారిన పడిన వారి శాతం పెరగడానికి గాలిలో విషవాయువులు చేరడమే అని తెలుస్తుంది.
మన శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అత్యవసరం. ఇది ఏమాత్రం తగ్గినా శరీర కణాలన్నీ చురుకుదనం తగ్గిపోతాయి. ప్రాణాధారమై ఆక్సిజన్ వాయువు మనం పీల్చుకునే గాలి ద్వారా అందుతుంది. శ్వాసనాళాల నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ్నుంచి రక్తంలో హిమోగ్లోబిన్ ద్వారా శరీరంలోని అన్నికణాలకు చేరుతుంది.
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ఏటా కోటి మంది చనిపోతున్నారు. అందులో 24శాతం మంది మన భారతీయులే. అభివృద్ధి చెందుతున్న మోట్రోపాలిటన్ నగరాల్లో గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్కులు పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. మన నగరంలో ఈ సమస్య కనిపిస్తుంది.
ముక్కు నుంచి నీరు కారడం..
మన శరీరంలోకి శ్వాసనాళాల ద్వారానే గాలి ప్రవేశిస్తుంది. కాలుషితమైన గాలిని మనం పీల్చినప్పుడు దాని ప్రభావం ముందుగా ముక్కుపైనే ఉంటుంది. దీని ద్వారా వచ్చే అలర్జీలో ముక్కులో మంట, దురద, ముక్కు నుంచి నీరు కారటం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాలుష్యంలో ఎక్కువ రోజులు ఉండటం ద్వారా సైనసైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో గొంతునొప్పి సమస్య కూడా వస్తుంది.
ముక్కుల్లోని సహజ రక్షణ కవచం దెబ్బతినడంతో..
ప్రకృతి సహజంగానే మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. గాలిలోని విషవాయువులు, దుమ్ము, ధూళి శ్వాసనాళాల్లోకి ప్రవేశించకుండా ముక్కులో జిరుగుపొర, సన్నటివెంట్రులకు అడ్డుకుంటాయి. అయితే గాలిలోని కాలుష్యం కారణంగా ఈ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ కారణంగానే శ్వాసనాళాల్లోకి దుమ్ము, ధూళి ప్రవేశించడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. కాలుష్యంతో రోగనిరోధకశక్తి కూడా క్షీణిస్తుంది.న్యుమోనియా, టీబీ, క్యాన్సర్లకు దారి తీస్తాయి. గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్షయ కేసులు పెరుగుతున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది.
శ్వాసనాళాలు కుంచుకుపోవడం..
గాలిలోని దుమ్ము, ధూళి, విష వాయువులు శ్వాసనాళాల గోడల్లోకి చేరడం వల్ల అవి ఉబ్బిపోయి గాలి పీల్చడం కష్టమవుతుంది. క్రమంగా శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. చాలామందిలో ఆస్తమ రావడానికి దారితీస్తాయి. కొందరిలో దగ్గు విపరీతంగా వస్తుంది. శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో పిల్లికూతలు వస్తుంది. ఊపిరితిత్తులు బరువుగా అనిపించి, ఛాతిలో పట్టేసినట్టు ఉంటుంది.
మరికొందరిలో ఊపిరితిత్తుల వాపు కారణంగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) సమస్య వస్తుంది.
రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా..
గాలిలో కాలుష్యం వల్ల కేవలం శ్వాసనాళాలే దెబ్బతింటాయి అనుకుంటారు. కానీ, శరీరకణాలన్నింటికీ ఆక్సీజన్ను సరఫరా చేసే హిమోగ్లోబిన్ ఉండే రక్తంలోనూ, రక్తనాళాల్లోనూ గాలి కాలుష్య ప్రభావం ఎంతగానో ఉంటుంది. కలుషితమైన గాలి కలుషితమైనప్పుడు హిమోగ్లోబిన్ కణాల్లోకి ఆక్సిజన్తో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడా చేరుతుంది. ఇది హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీహిమోగ్లోబిన్ మారుతుంది. ఆక్సిజన్ శాతం తగ్గడం, కార్బనెడయాక్సైడ్ శాతం పెరగడంతో రక్తాన్ని శుద్ధి చేసే గుండెపై భారం పడుతుంది. దాంతో గుండె రక్తనాళాల పనితీరులో మార్పులు వచ్చి అధికరక్తపోటు సమస్య వస్తుంది. దీర్ఘకాలంలో గుండెపోటుకు కారణం అవుతుంది. అంతేకాదు మెదడుకు రక్తం అందించే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వల్ల పక్షవాతం వచ్చ ప్రమాదం ఉంది. గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి.
మానసిక సమస్యలు..
గాలి కాలుష్యం వల్ల కేవలం శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. మన శరీరానికి అవసరమైన శక్తి లో అధిక శాతం శ్వాస ద్వారా తీసుకునే ఆక్సిజన్ నుంచే లభిస్తుంది. కాలుష్యం పెరగడంతో శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దాంతో శరీరకణాల్లో శక్తి తగ్గిపోయి త్వరగా అలసట వస్తుంది. నిస్సత్తువ, చిరాకు వంటివీ వేధిస్తాయి. కొందరిలో ఆందోళన, తలనొప్పి, కోపం, చిరాకు, ఏకాగ్రత దెబ్బతినటం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా అధ్యయనాల ద్వారా స్పష్టమైతుంది. అంతేకాదు అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి అనారోగ్య సమస్యలకు కూడా గాలి కాలుష్యం కారణం అవుతుంది. జాగ్రత్తలు..
అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కన్నా ముందుగానే కొన్ని సూచనలు పాటిస్తే జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఇందుకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి. సమిష్టి బాధ్యతగా తీసుకోవాలి. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవటం, కాలుష్యం బారినపడకుండా చూసుకోవటం ద్వారా సమస్యలను కొంతవరకైనా తగ్గించుకోవచ్చు.
బయటకు వెళ్లినపుడు ముక్కుకు మాస్క్ ధరించాలి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురుతో ఊడిస్తే దుమ్ముధూళి గాలిలో కలిసి, ఇంట్లో మూలలకు చేరుతుంది. గచ్చును తడిగుడ్డతో తుడుచుకోవటం మంచిది. వీధిలోని దుమ్ము, ధూళి ఇంట్లోకి చేరకుండా కిటికీలకు, డోర్లకు కర్టెన్లు వేయాలి. ఇంటిగోడల మూలల్లో దుమ్ము, బూజు చేరకుండా శుభ్రం చేస్తుండాలి. - దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి.
వంటింట్లోంచి పొగ బయటకు వెళ్లేలా ఫ్యాన్లు, చిమ్నీల వంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది.
మస్కిటో కాయిల్స్కు బదులు దోమతెరలు వాడుకోవటం ఉత్తమం.
పొగ అలవాటు ఉన్నవారు ఇంట్లో సిగరెట్ల వంటివి కాల్చకుండా చూసుకోవాలి.
వాహనాల ద్వారా వెలువడే కాలుష్యమే ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనాల కన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించుకోవడం మంచిది.
Authorization