వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వాడకంతో కంటి పై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కండ్లు మండటం, కంటి నుంచి నీరు కారటం వంటివి సమస్యలు ఎక్కువ వస్తాయి. దీని వల్ల కండ్లు అధిక ఒత్తిడికి గురై ఇతర కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కండ్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. కంటి సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలను ఇటూ అటూ కదపటం అనేది కీలకం. కంటికి మంచి వ్యాయామం కనురెప్పలను కదుపుతూ ఉండటం. ఇలా కంటికి సంబంధించిన వ్యాయామాన్ని రోజూ 5-10 నిమిషాల పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు తదేకంగా చూడకుండా కొంచెం బ్రేక్ తీసుకుని అటూ ఇటూ చూస్తూ ఉండాలి. గంటకు ఒకసారి ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు 50-60 సె.మీ దూరంలో ఉండాలి. లైటింగ్ కూడా తక్కువగా పెట్టుకుని పని చేస్తే మరీ మంచిది. ఎందుకంటే ఈ ప్రభావం కంటిపై చాలా ఎక్కువగా ఉంటుంది. కనుపాపను క్లాక్వైస్, యాంటీ క్లాక్వైస్ తిప్పుతూ ఉండండి. ఇలా 7-10 నిమిషాల పాటు రోజూ చేస్తే సరిపోతుంది. గంటకు ఒకసారి రెండు నిమిషాల పాటు కండ్లు మూసుకోవాలి. ఇది ఒత్తిడిని తొలగించి కండ్లు పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే తల నొప్పి రాకుండా చేస్తుంది. పిల్లలు కంప్యూటర్లో ఆటలు ఆడటానికి ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. అలా చేయకుండా సమయం దొరికితే చాలు నేటి తరం పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు. కండ్లు ఎక్కువగా మంటలు పుడితే ఐస్క్యూబ్స్, దోసకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని కంటిపై పెట్టుకుంటే చల్లదనాన్ని పొందుతారు. కంప్యూటర్ నుంచి విడుదలయ్యే హానికర కిరణాలు కంటిపై పడటం వల్ల దీర్ఘకాలిక సమస్యలను వచ్చే ప్రమాదం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటి సమస్యలు వస్తే సొంతవైద్యం చేసుకోకుండా కంటి డాక్టర్ను కలవాలి. డాక్టర్ సూచన మేరకు ఐ డ్రాప్స్ వాడాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డ్రాప్స్ వాడుతూ కంటికి విశ్రాంతి ఇవ్వాలి.