పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి మనకు ప్రకృతి సహజంగా లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారికి ఇవి ఎంతో అవసరం. పెద్దవారు అనేక కారణాలరీత్యా ఆహార విషయాల్లోనూ కొన్ని నియమాలు పాటించక తప్పదు. అయితే వారికి విటమిన్-డి, కాల్షియం, విటమిన్-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. వయసు పైబడినవాళ్లు ఎప్పుడూ తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తీసుకోవటం ద్వారా విటమిన్-డి, కాల్షియం పొందవచ్చు. ఇవి ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడుతాయి. - చేపలు, తేలికైన మాంసం నుంచి విటమిన్-బి12 అందుతుంది. - సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం, పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకుంటే ఆ బాధ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ఎందుకంటే వీటన్నింటిలోనూ పీచు అధికంగా ఉంటుంది. - పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలలో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. - నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.