Authorization
Mon Jan 19, 2015 06:51 pm
. నవ తెలంగాణ 5వ వార్షికోత్సవం...
హైదరాబాద్ : ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రశ్నించాల్సిన మీడియా కరోనా సమయంలో పాలకుల మాటలకు వంతపాడటం ఎంత వరకు సమంజసం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు. దేశంలో కరోనా మహ్మమారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలను తప్పుదోవపట్టించడం బాధాకరం...మీడియా ఇప్పటికైనా పాలకులు చెప్పే విషయాల వాస్తవాలను చెప్పాలని అన్నారు. నేడు నవ తెలంగాణ ఐదవ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సభను ఆన్ లైన్ లో నిర్వహించారు. పత్రికా సంపాదకులు ఎస్.వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోన అతిధిగా ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, నవ తెలంగాణ బోర్డు సభ్యులు సుధా భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ... నవ తెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాలకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాపై పలు విమర్శలు చేసారు. కరోనాపై పాలకులు చేబుతున్న విషయాలను మీడియా ప్రశ్నించకపోవడం బాధకరమని అన్నారు. కరోనా వచ్చాక ఆస్పత్రులు బాగా లేవని, ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఇప్పుడు మీడియా ప్రచారం చేయడం సరైందని కాదు..ముందు నుండే ఈ విషయాలను ప్రజలకు చెప్తే బాగుండేదని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతీ మీడియా సంస్థ ఈ సమయంలో వాస్తవాలను చెప్పాలని కోరారు. మొదటి నుండి మన పాలకులు కరోనా విషయంలో ప్రజలను తప్పుదోవపట్టించారు. అందువల్లే దేశంలో ప్రస్థుతం ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కూడా ప్రధాని మోడీ...మనం మెరుగైన స్థితిలో ఉన్నామని అన్నారు. ఇది ఏ విధంగా ప్రధాని మోడీ చెబుతున్నారని ఏ ఒక్క మీడియా సంస్థ ప్రశ్నించకపోవడం బాధకరమని విచారం వ్యక్తం చేసారు. పాలకులు ఇచ్చిన సమాచారాన్ని హైలైట్ చేయడం ఎంత వరకు సమంజసం. దేశంలో కరోనా కేసుల నమోదులో, మరణాలు విషయంలో మనం స్థితిలో ఉన్నామో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవనం కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎడిటర్ వీరయ్య మాట్లాడుతూ... నవ తెలంగాణ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా వార్షికోత్సవ సభను ఈ విధంగా జరుపుకోవడం విచారకరమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహ్మమారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు 3 వారాల్లో కరోనా అంతమవుతుందని ప్రధాని మాట్లాడినప్పుడు ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. కానీ దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న సందర్భంలో ప్రధాని మోడీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది దేనికి సంకేతం, దీనికి బాధ్యులు ఎవరు.? అని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రం కేరళ కరోనాను కట్టడి ఎలా చేయగలిగింది. చిన్న దేశాలు సైతం కరోనాను కట్టడి చేస్తుంటే దేశ ప్రధాని మాత్రం బడా బాబుల ప్రయోజానాలే ముఖ్యంగా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలు దేశానికి వచ్చాయి. కానీ ఓ వైపు దేశంలో మహ్మామారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంటే...ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంటే...మన పాలకులు మాత్రం విమానాల గురించి మాట్లాడం దేనికి సంకేతం. సరే యుద్ధ విమానాలు వచ్చేది దేశ రక్షణకు మంచిదే కానీ.. ప్రజల సంగతేంటీ.. వచ్చింది కరోనాకు మందు కాదు...యుద్ద విమానాలు... అని ప్రముఖ సీనియర్ ప్రాతికేయులు రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారని ఈ సందర్భంగా తెలిపారు. మీడియా కూడా ప్రభుత్వాల మాటలకు వంతపాడటం తప్ప వాస్తవాలను ప్రజుల ముందుకు తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుత సమయంలో పాలకులు ప్రజలను పట్టించుకోవడంలేదు. కావున ప్రజలు వ్యక్తిగతంగా తమను తాము రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సీజీఎం ప్రభాకర్ ఆహ్వనం పలకగా, బోర్డు సభ్యులు సుధా భాస్కర్ వందన సమర్ఫణ చేసారు.