Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అనారోగ్యం బారిన పడిన 19 రోజుల పసికందును హాస్పిటల్కు తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది. వెనుక నుంచి కారు ఢీకొనడంతో తల్లి చేతుల్లో నుంచి ఆ చిన్నారి ఎగిరి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బండిపై నుంచి పడిపోవడంతో.. ఆ తల్లికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన సార మురళి, అంజలి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇటీవలే బాబు జన్మించాడు. మురళికి ముగ్గరు సోదరులు ఉండగా.. వారికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. ఇంట్లో ఓ మగ పిల్లాడు ఉండాలని అందరూ ఆరాటపడ్డారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. కొద్ది రోజుల క్రితం బాబు జన్మించాడు. ఏకైక మగ సంతానం కావడంతో.. నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించాలని భావించారు. బంధు మిత్రులకు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ రెండు రోజుల్లో వేడుక అనగా.. ఆ పసికందుకు విరేచనాలు అయ్యాయి. దీంతో వైద్యం చేయించడం కోసం మురళి దంపతులు చిన్నారిని తీసుకొని బైక్ మీద తుప్రాన్ బయల్దేరారు. వారితోపాటు మురళి అన్న కూతురు కూడా బయల్దేరింది. నాగులపల్లి జంక్షన్ వద్ద హైవే పనులు జరుగుతుంటంతో బైక్ను వెనక్కి తిప్పారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తోన్న ఓ బైక్, కారు వరుసగా ఢీకొట్టాయి. దీంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు శిశువు కూడా ఎగిరి పడ్డాడు. బలమైన గాయాలు కావడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సిజేరియన్ ద్వారా ఆ బాబుకు జన్మనిచ్చిన తల్లికి తల, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రయివేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉండగా.. బిడ్డ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. రాఖీ పండుగ రోజు ఆ చిన్నారి మరణించడంతో.. కన్నా లేరా.. అక్కలతో రాఖీ కట్టించుకోరా.. నువ్వు లేవని మీ అమ్మకు ఎలా చెప్పాలి రా అని నానమ్మ రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.