Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య జరిగిన దాడులతో కడప జిల్లా ఉలిక్కి పడింది. రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో బీజేపీకి చెందినవారు ఆరుగురు, వైసీపీకి చెందినవారు ముగ్గురు గాయపడ్డారు. బీజేపీకి చెందిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేశ్ కూడా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... ఇటీవలే అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ప్రసాద్, గ్రామ వాలంటీర్ వెంకటేశ్ మధ్య సంక్షేమ పథకం విషయంలో గొడవ జరిగింది. దీంతో, బీజేపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.