Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా 70 డెల్టాప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. SARS-CoV2కు చెందిన 58,240 నమూనాలను సీక్వెన్సింగ్ చేసి.. 46,124 శాంపిల్స్ను విశ్లేషించినట్టు వివరించారు. ఈ శాంపిల్స్లో అత్యధికంగా 17,169 డెల్టా వేరియంట్ కేసులే ఉన్నట్టు తెలిపారు. లోక్సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలను పేర్కొన్నారు.
ఈ నమూనాల్లో 4,172 ఆల్ఫా వేరియంట్, 217 బీటా, ఒకటి గామా వేరియంట్ ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 కేసులు రాగా.. మధ్యప్రదేశ్లో 11, తమిళనాడులో 10, చండీగఢ్లో 4, కేరళ, కర్ణాటకలలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లలో రెండేసి కేసులు చొప్పున నమోదు కాగా.. ఉత్తరాఖండ్, హరియాణా, జమ్మూ, రాజస్థాన్, ఒడిశా, హిమాచల్ప్రదేశ్లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని పేర్కొన్నారు.