Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహిళలు ఎంత ఉన్నతమైన స్థానాలకు ఎదిగినా వారిపై లైంగికదాడుల ఆగడం లేదు. తాజాగా ఓ మహిళా ఐపీఎస్ అధికారిని పై డీజీపీ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సీబీసీఐడీ అధికారులు, బాధితురాలి సమాచారం ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫిబ్రవరిలో ఒక సభలో ప్రసంగిస్తుండగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా ఎస్పీని స్పెషల్ డీజీపీ తన కారులోకి పిలిచాడు. సీఎం తర్వాత సభకు తనతో రావచ్చన్నాడు. తనకు స్నాక్స్ ఇచ్చి తనతో పాట పాడించుకున్నాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడబోయాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. కారులో నుంచి దిగిపోయింది. తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి, ఆ స్పెషల్ డీజీపీపై బాధిత మహిళ ఫిర్యాదు చేసేందుకు సేలం నుంచి చెన్నైకి బయలుదేరింది. అయితే స్పెషల్ డీజీపీ తన పలుకుబడిని ఉపయోగించి ఆమెను వెళ్లకుండా ఉండేందుకు యత్నం చేశారు. మధ్య మండల ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ సహా 50 మందికి పైగా పోలీసులు చెంగల్పట్టు చెక్పోస్టు వద్ద దారికాచి, బాధిత మహిళ కారును అడ్డగించి రాజీ చర్చలు జరిపారు. అయితే ఇందుకు ఒప్పుకోని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చే తీరుతానని బయలుదేరింది. దాంతో వారు ఆమె కారు తాళాలు లాక్కుని ఘర్షణ పడ్డారు. అయినాగానీ ఎలాగోలా చెన్నై వచ్చి ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పడి విచారణ చేపట్టగా స్పెషల్ డీజీపీ చేసిన నేరం నిర్ధారణైంది.
చెంగల్పట్టు చెక్పోస్ట్ వద్దనున్న సీసీ కెమెరాల పుటేజ్ను పరిశీలించగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి అక్కడ బాధితురాలిని అడ్డుకున్న విషయం బయటపడింది. దాంతో స్పెషల్ డీజీపీతోపాటు మిగిలిన ముగ్గురు పోలీస్ అధికారులపైనే కేసు నమోదైంది. స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు మాత్రం యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురిపై చార్జిషీటు దాఖలుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది. ఈ లేఖ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సిఫార్సు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది.