Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేసీఆర్ చెబుతున్న దళితబంధు పథకం బూటకమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. దళితుల గురించి కేసీఆర్ ఎన్నో చెప్పారని... ఇంతవరకు చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని... చెప్పలేదంటే తాను తల నరుక్కుంటానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం గత ఏడేళ్లలో రూ. 85,913 కోట్లను కేటాయించారని.. అయితే కేవలం రూ. 47,685 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని... మిగిలిన రూ. 38 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని ఎక్కడ వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితులకు ఏమీ చేయని కేసీఆర్... కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని గీతారెడ్డి దుయ్యబట్టారు. గత ఏడేళ్లలో అంబేద్కర్ విగ్రహానికి ఒక్కరోజైనా కేసీఆర్ పూలమాల వేశారా? అని ప్రశ్నించారు. ఉపఎన్నిక నేపథ్యంలో దళితులను ప్రగతి భవన్ కు పిలిపించి అంబేద్కర్ బొమ్మకి పూలమాల వేశారని చెప్పారు. దళితబంధు పథకాన్ని హూజూరాబాద్ కు మాత్రమే కాకుండా... రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.