Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సమాధిలో పాతిపెట్టిన మృతదేహం రాత్రవగానే రోడ్డు పక్కన పడి ఉంది. అది చూసిన స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన నల్లగొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (60) అనారోగ్య సమస్యలతో శుక్రవారం మృతి చెందింది. దాంతె ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తమ సంప్రదాయాల ప్రకారం మృతదేహాన్ని పూడ్చి పెట్టి ఖననం చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం పాతిపెట్టిన మృతదేహం రాత్రివేళ రోడ్డుపక్కన కనిపించింది. అది చూసిన కొందరు గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాధిలో ఉండాల్సిన శవం బయటకు ఎలా వచ్చిందా అని ఆలోచించారు. కుక్కలు, ఇతర జంతువులు తవ్విన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఎవరో తవ్వి బయటకు తీశారని అర్థమైంది. ఇంతలోనే అదే గ్రామానికి చెందిన కొందరు వచ్చి ఓ జంట శవాన్ని బయటకు తీసిందని, అది తాము చూసినట్టు చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఆ జంటను ప్రశ్నించారు. అందుకు ఆ జంట
..తమ వంశానికి చెందిన వారి సమాధుల కోసం భూమిని ఖాళీగా ఉంచామని.. అక్కడ బుచ్చమ్మ మృతదేహాన్ని ఎందుకు ఖననం చేశారని ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా ఎలా పూడ్చిపెట్టినందుకే శవాన్ని బయటకు తీసినట్లు వెల్లడించారు. అయితే ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కానీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత తమకు చెప్పకుండా రాత్రిపూట మృతదేహాన్ని బయటకు తీయడం ఏంటని బుచ్చమ్మ బంధువులు ప్రశ్నించారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.