Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు.
కృష్ణా బేసిన్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ విడుదల చేసినందున ఏపీ పిటిషన్పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని.. ఈలోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉన్నందున తక్షణం గెజిట్ అమలు చేయాలని ఏపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నాలుగు నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని చెప్పారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న జస్టిస్ ఎన్.వి.రమణ.. ప్రభుత్వాలతో సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలని రెండు రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు సూచిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.