Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
మృత్యువులో సైతం వీడని స్నేహబంధం మనసులను కలిచి వేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఆరుగురు స్నేహితుల్లో ముగ్గురు ప్రమాదవశాత్తు మృతి చెందారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం జి జి నడకుడ గ్రామం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ప్రమాదవశాత్తు ముగ్గురు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆటవిడుపు కోసం వచ్చారు. ప్రమాదవశాత్తు రాహుల్ (19), శివ(20), ఉదయ్(19)లు నీట మునిగి మృత్యువాతపడ్డారు. మృతులంతా ఒకే కాలనీకి చెందిన వారుగా బంధువులు తెలిపారు. నందిపేట ఎస్ఐ శోభన్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేసి మృత దేహాలను బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. ఆరుగురు స్నేహితుల్లో ఒకరు ఒడ్డున ఉండగా అయిదుగురు స్నానం కోసం నీళ్లలోకి వెళ్లినట్లు తోటి స్నేహితుడు తెలిపారు. కానీ అక్కడ వ్యవసాయ బావి ఉండడంతో ఆ బావిలో నీట మునిగినట్లు సర్పంచ్ వివరించాడు. గ్రామస్తుడు రాజేశ్వర్ గేదెల అటుగా వెళ్లగా పిల్లల అరుపులు కేకలు విని వారిని కాపాడినట్లు తెలిపాడు. ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమ్మి కూడారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.