Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తయారీ లోపాలు లేదా ఛార్జింగ్ పెట్టే సమయంలో పొరపాట్లు చేయడం వల్ల అప్పుడప్పుడూ స్మార్ట్ఫోన్లు పేలిపోతుంటాయి. గత కొద్ది కాలంగా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఇలాంటి ఘటన.. మొబైల్ యూజర్లను షాక్కు గురి చేస్తోంది. అంకూర్ శర్మ అనే ఓ వ్యక్తి భార్య, తన హ్యాండ్ బ్యాగ్లో వన్ప్లస్ ఫోన్ను ఉంచి సైకిల్పై వెళ్తుండగా అది పేలిపోయింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేసింది. దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా వన్ప్లస్ కస్టమర్ సపోర్ట్కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ విషయంపై వన్ప్లస్ దర్యాప్తు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. వన్ప్లస్ నార్డ్-2 5జీఫోన్ గత నెల విడుదలయ్యింది. అయితే 5 రోజుల క్రితం ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ను బెంగళూరుకి చెందిన అంకుల్ శర్మ భార్య కొనుగోలు చేసింది. ఆదివారం ఉదయం ఆమె తన దినచర్యలో భాగంగా తన ఫోన్ను బ్యాగ్లో ఫోన్ను ఉంచి సైకిల్ పై బయటికి వెళ్ళింది.
ఈ క్రమంలోనే చెవులు దద్దరిల్లే శబ్దంతో వన్ప్లస్ నార్డ్-2 5జీ ఫోన్ పేలిపోయింది. దీంతో సదరు మహిళ సైకిల్ పైనుంచి కింద పడిపోయింది. తీరా చూస్తే, తన బ్యాగ్ నుంచి పొగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అది ఓపెన్ చేసి చూడగా మొబైల్ ఫోన్ కాలిపోయి కనిపించింది. దీనితో ఆమె తన భర్త అంకూర్ శర్మకు చెప్పగా ఆయన ఈ దుర్ఘటన గురించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. వన్ప్లస్ కస్టమర్ సపోర్ట్ను ట్యాగ్ చేస్తూ తన ట్వీట్ లో పేలిపోయిన ఫోన్కు సంబంధించిన 3 ఫొటోలు పోస్ట్ చేశారు. కొద్ది నిమిషాల తర్వాత అధికారిక కస్టమర్ సపోర్ట్ శర్మ ట్వీట్ పై స్పందించింది. "హాయ్, అంకూర్. మీకు జరిగిన ఘటన గురించి తెలుసుకొని మేము చింతిస్తున్నాం. అలాగే మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డైరెక్ట్ మెసేజ్ ద్వారా మాతో కనెక్ట్ అవ్వండి. మేము మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం." అని వన్ప్లస్ కస్టమర్ సపోర్ట్ ట్వీట్ చేసింది. అయితే బాధిత వినియోగదారుడికి వన్ప్లస్ కంపెనీ పరిహారంగా కొత్త ఫోన్ ఇచ్చిందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
కాగా, ఓ ప్రముఖ టెక్ వెబ్ సైట్ ఈ ఘటనపై ఆరా తీసింది. యూజర్ చేసిన పొరపాట్ల కారణంగా ఫోన్ పేలిందా? లేదా తయారీలో లోపం వల్ల మొబైల్ బ్లాస్ట్ అయ్యిందా? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు వన్ప్లస్ కంపెనీ స్పందించింది. ఘటన జరిగిన వెంటనే బాధిత యూజర్ను సంప్రదించామని.. తరువాత అంతర్గత దర్యాప్తు ప్రారంభించామని చెప్పుకొచ్చింది. అయితే ఇంతకు ముందు ఎప్పుడూ జరగని ఓ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కారణంగానే ఫోన్ పేలినట్టు దర్యాప్తులో తేలిందని, దీనికి తయారీ లోపం కారణం కాదని కంపెనీ తెలిపింది. వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని హామీ ఇచ్చిన వన్ప్లస్ సంస్థ.. ఈ డివైజ్ క్వాలిటీ, సేఫ్ టెస్టులు సక్రమంగా జరుపుతున్నామని తెలిపింది.