Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్ధాల తర్వాత ఇండియన్ జట్టు .. ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకున్నది. మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. సెమీస్లో ఓడిన తర్వాత భారత హాకీ ప్లేయర్లతో ఫోన్లో మాట్లాడిన మోడీ.. వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఆ సమరోత్సాహంతోనే ఇవాళ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో దుమ్మురేపింది. ఒలింపిక్స్ హాకీలో పూర్వ వైభవాన్ని చాటిన మెన్స్ హాకీ జట్టుకు మోడీ విషెస్ తెలిపారు. ఇదో చరిత్రాత్మక దినమని, ప్రతి భారతీయుడి మదిలో ఈ విజయం చిరస్మరణీయంగా నిలుస్తుందని మోడీ అన్నారు. దేశంలోని యువతను హాకీ జట్టు ఆకర్షించిందని, దేశమంతా వారి విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. హెడ్ కోచ్ గ్రహమ్ రీడ్, అసిస్టెంట్ కోచ్ పీయూష్ దూబేలు కూడా మోడీతో సంభాషించారు. మొత్తం టీమ్కు ప్రధాని కంగ్రాట్స్ చెప్పారు. బ్రాంజ్ మెడల్ గెలిచినందుకు వారిని అభినందించారు. భారత జట్టును ప్రోత్సహించిన ప్రధాని మోడీకి కెప్టెన్ మన్ప్రీత్ థ్యాంక్స్ తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కూడా మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో హాకీ మెడల్ సాధించిన టీమిండియాకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. భారత జట్టు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, గెలుపు కోసం పట్టుదలతో పోరాడిందన్నారు. ఈ చరిత్రాత్మక విజయం.. హాకీ లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యువ క్రీడాకారుల్లో ఈ గెలుపు ప్రేరణ నింపుతుందని తన ట్విట్టర్లో రామ్నాథ్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాకీ జట్టుకు చీర్స్ చెప్పారు. భారత జట్టుకు బిలియన్ చీర్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. బాయ్స్.. మీరు అద్భుతంగా రాణించారని, మేం ఇక మౌనంగా ఉండలేమని ఆయన అన్నారు. మెన్స్ హాకీ జట్టు ఆట మొత్తం డామినేట్ చేసిందని, ఒలింపిక్ చరిత్రపుటల్లో ఉన్న తమ స్థానాన్ని మళ్లీ అందుకున్నట్లు మంత్రి ఠాకూర్ తెలిపారు. హాకీ జట్టు పట్ల గర్వంగా ఉందన్నారు.