Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కి కొన్ని నెలలుగా ప్రధాన సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ పదవికి రాజీనామా చేశారు. కొంత కాలంపాటు వ్యక్తిగత జీవితంతపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాను ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర పోషించకుండా తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని, ప్రధాన సలహాదారు పదవిలో కొనసాగలేనని చెబుతూ అమరీందర్ సింగ్కు ఆయన రాజీనామా లేఖ పంపారు. తన భవిష్యత్తు కార్యాచరణపై కూడా తాను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తనను ప్రధాన సలహాదారు పదవి నుంచి రిలీవ్ చేయాలని ఆయన కోరారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిశోర్ను తన ప్రధాన సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించుకున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ను గెలిపించేందుకు మమతా బెనర్జీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఆ రాష్ట్రంలో టీఎంసీ గెలిచింది. అనంతరం వ్యూహకర్తగా ప్రత్యక్షంగా పనిచేయబోనని, తన బృందం మాత్రం పనిచేస్తుందని చెప్పారు. ఇటీవల దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల అధినేతలతో చర్చించి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సమయంలో అమరీందర్ ప్రధాన సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేయడం గమనార్హం.