Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోని సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్వీ రమణ .. దర్యాప్తు సంస్థల తీరును తప్పుపట్టారు. సీబీఐ తన తీరు మార్చుకోవడం లేదన్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ, తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందిచడం లేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉన్నదన్నారు. గత నెల 28న జార్ఖండ్లో ధన్బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు వ్యాన్తో తొక్కించి చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టుకు తాజాగా సీబీఐకి నోటిసులు జారీచేసింది. జడ్జి హత్య కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఆయన అన్నారు.