Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైతులకు శుభవార్త. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిలు నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారన్నారు. అనంతరం ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయని చెప్పారు. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్టు లబ్దిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలన్నారు. రైతు రుణ మాఫీతో పాటు కొత్త పంట రుణానికి వారు అర్హులని ఆ సందశంలో తప్పకుండా పేర్కొనాలన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల రుణ మాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ తరుపున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు