Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కోర్టు ధిక్కార కేసులో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సికింద్రాబాద్ ఆర్డీవో డి.వసంతకుమారి, తిరుమలగిరి తహసీల్దారు గఫార్ హుసేన్ నాయిబ్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులిచ్చింది. హైదరాబాద్ లోతుకుంట గ్రామ సర్వే నెం.1, 2లలోని 40 ఎకరాలకు సంబంధించిన కేసులో భూమిని నాలుగు వారాల్లోగా పిటిషనర్లకు అప్పగించాలని, కోర్టు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని హైకోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు చేయకపోవడంతో శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నర్సయ్య కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సివిల్ కోర్టులో దావా వేసిందని పిటిషనర్లు తెలిపారు. కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు శుక్రవారం విచారించారు. సివిల్ దావా వేయడం ద్వారా హైకోర్టు ఆదేశాలను వక్రీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
అధికారులకు నోటీసులిచ్చి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సివిల్ కోర్టు ఉత్తర్వులిచ్చే సాహసం చేయలేదని, ఒకవేళ అదే చేస్తే సివిల్ కోర్టు జడ్జి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 27కి వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన దావా సోమవారం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.