Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: పంజాబ్లోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ప్రముఖ పర్యావరణవేత్త బల్బీర్ సింగ్ సీచెవాల్, అలాగే పంజాబీ సంస్కృతి పరిరక్షణకు పాటు పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ జిత్ సింగ్ సాహ్నిలను రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలకు పంపేందుకు అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ప్రకటన చేశారు.
'ఆప్ ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఒకరు పర్యావరణవేత్త పద్మశ్రీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్. మరొకరు పద్మశ్రీ విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ. వారిద్దరికీ నా శుభాకాంక్షలు` అని సిఎం మన్ పేర్కొన్నారు.
పంజాబ్ అంబికా సోనీ (కాంగ్రెస్), బల్వీందర్ సింగ్ భుందర్ (శిరోమణి అకాలీదళ్) రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఈ మేరకు తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 31. నామినేషన్ల పరిశీలన జూన్ 1న, అభ్యర్థిత్వ ఉపసంహరణకు జూన్ 3 చివరి తేదీ. జూన్ 10 ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు.