Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా గత ఏడాది నవంబరులో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే యోచనలో ఉందని పలు అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాలకు కేటాయించే బడ్జెట్లలో జాప్యం చేస్తోందని సమాచారం. తీసివేతలకు సంబంధించి ఇప్పటి వరకూ మెటా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
బడ్జెట్లు, కొనసాగబోయే ఉద్యోగుల సంఖ్య విషయంలో కంపెనీలో అస్పష్టత నెలకొందని ఇద్దరు ఉద్యోగులు తెలిపినట్లు ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. మరోవైపు 2023లో కంపెనీ సామర్థ్యాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో మిడిల్ మేనేజర్లు, డైరెక్టర్లు సైతం పనిలో భాగస్వాములు కావాల్సిందేనని చెప్పారు. లేదంటే కంపెనీని వీడాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. అలాగే కంపెనీలో మేనేజర్లను పర్యవేక్షించడానికి కూడా మేనేజర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తొలగింపులకు సంబంధించిన సంకేతాలిచ్చారు. మరోవైపు ఆశించిన స్థాయిలో ఫలితాలులేని ప్రాజెక్టులను మూసివేయనున్నట్లు మెటా ఇటీవల ప్రకటించడం గమనార్హం.