Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్లైన్స్, పెగాసస్ ఎయిర్లైన్స్ ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలైన ఇస్తాంబుల్, అంకారా, అంటాల్యా సహా ఇతర ప్రాంతాలకు ప్రజలను ఉచితంగా చేరవేస్తామని ప్రకటించాయి. భూకంపంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లు, టూరిస్టు ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. గజియాంటెప్, హతాయ్, నుర్దగి, మరాష్ నుంచి వేలాదిమంది తరలివెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వేలాదిమంది రావడంతో గజియాంటెప్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఏడో రోజూ కూడా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు అణువణువు గాలిస్తున్నాయి. టర్కీ, సిరియాల్లో గతవారం సంభవించిన భారీ భూకంపంలో 28 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత శతాబ్దకాలంలోనే సంభవించిన అతిపెద్ద విపత్తుగా దీనిని చెబుతున్నారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భూకంపం కారణంగా నిరాశ్రయులైన లక్షలాదిమంది ప్రజలు ఆకలి, వణికించే చలి మధ్య కాలం గడుపుతున్నారు. చలి కారణంగా మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రెస్క్యూ బృందాలు శనివారం రాత్రి గుర్తించి వెలికి తీశాయి.