Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ కాల్ కలకలం సృష్టించింది. పుణెలోని గూగుల్ సంస్థకు బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. అనంతరం అది ఫేక్కాల్గా గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చినట్లు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం 7.54 నిమిషాలకు ఓ ఫోన్ వచ్చింది. పుణెలోని ముంధ్వా ప్రాంతంలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ విషయంపై గూగుల్ సిబ్బంది వెంటనే స్థానిక బీకేసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక పోలీసులతో పాటు బాంబు నిర్వీర్య బృందాలు అక్కడకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. చివరకు ఫేక్ కాల్గా ధ్రువీకరించిన పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి బెదిరింపుకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.