Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు ధీటుగా కరీంనగర్లో పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
మార్చి నెలాఖరులోగా పెండింగ్ పనులు, ఐలాండ్స్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ చౌక్, వన్ టౌన్ ల వద్ద ఐలాండ్ ల కోసం గుంతలను తవ్వి వదిలవేయడం పట్ల కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే టెండర్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్ద గలిగామన్నారు. గతంలో 40 ఫీట్ల రోడ్లతో ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ సహకారంతో 40 ఫీట్ల రోడ్లను వంద ఫీట్లకు విస్తరించామన్నారు. కరీంనగర్లో జరుగుతున్న సుందరీకరణ పనుల పరిశీలనకు స్మితా సబర్వాల్ ఈ నెల 16న రానున్నారని ఆయన వెల్లడించారు.