Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అమానుషం జరిగింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. కాట్రేనికోన మండలంలోని సముద్ర తీర గ్రామమైన చిర్ర యానాంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఈ నెల 6న బట్టలు ఉతికేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఐదుగురు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెను సరుగుడు తోటలోకి ఈడ్చుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురికాగా, తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా, గ్రామ పెద్దల సమక్షంలో నిందితులు లక్ష రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే, ఆ సొమ్మును తీసుకునేందుకు వారు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న డీఎస్పీ వై.మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.