Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ ఆర్థిక పరిస్థితిపైన, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీడీ డైలాగ్ పేరుతో గురువారం దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో నోటికొచ్చిన విమర్శలు చేయడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీర్ ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు ఒకరికి మించి ఒకరు అబద్దాలు మాట్లాడారని, పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. మోడీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి' అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని, ముగ్గురు కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరైనట్టు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెబుతున్నారని, మరో మంత్రి మన్సుక్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని మాట్లాడుతున్నారని.. ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే కేంద్ర మంత్రులు అందరూ ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేందుకు ట్రెయినింగ్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అదేవిధంగా తెలంగాణలో ఉనికిలో లేని 9 మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా క్రియేట్ చేసిన కిషన్రెడ్డిపై కేటీఆర్ మరిన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్రెడ్డి ఆపర మేథావి అని వ్యాఖ్యానించారు. అంతేగాక హైదారాబాద్లో గ్లోబల్ మెడికల్ సెంటర్ ఏర్పాటు గురించి కిషన్రెడ్డి చేసిన ప్రకటన ఒట్టి బూటకమని విమర్శించారు.