Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామ జిల్లా కేంద్రంలో గ్యాస్ లీక్ అవడం కలకలం రేపింది. స్థానిక గీతా నగర్ కాలనీలో క్లోరిన్ సిలిండర్ లీక్ కావడంతో స్థానిక ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్ జైలు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద నీళ్లలో కలిపే క్లోరిన్ సిలిండర్ పైప్ గురువారం రాత్రి లీక్ అయింది. గ్యాస్ బయటికి రావడంతో చుట్టుపక్కల 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు, వికారం, వాంతులు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమస్యను పరిష్కరించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. '10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే బాధితులు ఆస్పత్రికి వరుస కట్టారు. శ్వాస ఆడటంలేదని, దగ్గు వస్తోందని, వికారంగా ఉందని చెప్పారు' అని ఓ డాక్టర్ వెల్లడించారు. వాటర్ ట్యాంకులో ఉన్న క్లోరిన్ గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల ఇలా జరిగింది. పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ప్రాణాపాయం లేదు అని వివరించారు.