Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 49వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో లభించే రాబ్ (ద్రవ బెల్లం), పెన్సిల్ షార్ప్నర్లపై పన్ను రేటును తగ్గించారు. వార్షికాదాయానికి సంబంధించి రిటర్నుల ఫైలింగ్ ఆలస్యంపై విధించే ఫీజును హేతుబద్ధీకరించారు. దిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం సమావేశం వివరాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు.
గుట్కా, పాన్ మసాలా పరిశ్రమలు పన్ను ఎగవేత, జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు మంత్రివర్గ ఉపసంఘాలు సమర్పించిన నివేదికలను స్వల్ప మార్పులతో ఈ సమావేశంలో ఆమోదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. త్వరలో వీటిని సభ్యుల అభిప్రాయాల కోసం పంపనున్నామని, అనంతరం ఛైర్మన్ ఆమోదించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే, 2022 జూన్కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార బకాయి రూ.16,982 కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ నిధులను కేంద్రం తన సొంత నిధుల నుంచి ఇస్తోందని, భవిష్యత్లో సెస్సుల ద్వారా సమకూరే మొత్తం ద్వారా ఆ నిధులను భర్తీ చేస్తామని వెల్లడించారు. దీంతో 2017 జీఎస్టీ చట్టం ప్రకారం ఐదేళ్ల కాలానికి చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని చెల్లించినట్లేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిహార బకాయిల కింద ఏపీకి రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు రానున్నాయి.
ద్రవ బెల్లానికి సంబంధించి జీఎస్టీ రేటును 18 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బెల్లాన్ని ప్యాకింగ్ చేస్తే 5 శాతం, విడిగా అమ్మితే ఎలాంటి పన్నూ ఉండదని తెలిపారు. పెన్సిల్ షార్ప్నర్లపై 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి చేరుస్తున్నామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీఆర్-9 దాఖలు విషయంలో ఆలస్య రుసుమును హేతుబద్ధీకరించారు. రూ.5 కోట్ల వరకు ఆలస్య రుసుమును రోజుకు రూ.50 గానూ, రూ.50-20 కోట్ల టర్నోవర్ కలిగిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ.200గా ఉంది.