Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లో ఇద్దరు దుండగులు వివాహితను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరంచెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త కూలి పనులు చేస్తాడు. భార్య (29) గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తోంది.
అయితే శుక్రవారం ఆమె పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఓ వ్యక్తి (30) అనుసరించాడు. తమ దగ్గర పని ఉందని మభ్యపెట్టి ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఉదయం పనికి వెళ్తుండగా బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రయివేటు ఉద్యోగి సుమిత్కుమార్ శర్మ (33) కారులో అనుసరించారు. పని ఇప్పిస్తామని మాట్లాడుతూ బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారు. ఆమె స్పృహ కోల్పోయాక కిస్మత్పూర్, దర్గాఖలీజ్ఖాన్, ఓఆర్ఆర్పై కారులో తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ ఆమెపై లైంగిక దాడి చేశారు.
ఈ క్రమంలో రాత్రివేళ బాధితురాలి మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెలతాడు లాక్కుని ఆమెను గండిపేట సమీపంలో వదిలి వెళ్లిపోయారు. స్పృహ వచ్చాక భర్తకు, మేనమామకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే నార్సింగి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ నంబర్లు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని సైబరాబాద్ కమిషనర్ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.