Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలో నకిలీ కరెన్సీ ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం క్రైమ్ డీసీపీ శబరిష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓల్డ్ సిటిలో ఒక ఇంటిపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి రూ. 27 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆ గ్యాంగ్లో ముగ్గురు కీలకంగా ఉన్నారని, అందులో రామేశ్వరి అనే మహిళ కూడా ఉందని.. అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. ఫేక్ కరెన్సీ తయారీలో రమేష్ బాబు అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, అతను గుజరాత్లో కూడా ఫేక్ కరెన్సీ సర్క్యూలేట్ చేసాడని డీసీపీ శబరిష్ తెలిపారు. నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించిన లాప్టాప్, లామినేషన్ ప్రింటర్, పేపర్, కలర్ బాక్స్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబుతోపాటు మరో నిందితుడు పరారీలో ఉన్నారని వారి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారన్నారు. రమేష్ బాబు గతంలో గోపాలపురంలో ఫేక్ కరెన్సీ కేసులో అరెస్ట్ అయ్యాడన్నారు. జైల్లో ఉన్నప్పుడు హాసన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని, రమేష్ బాబుకు రామేశ్వరి సోదరి అవుతుందన్నారు. నిందితులపై హైదరాబాద్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, యూట్యూబ్ ద్వారా దొంగ నోట్లు తయారీని నిందితులు నేర్చుకున్నారని డీసీపీ శబరిష్ తెలిపారు. ప్రధాన నిందితుడు రమేష్ బాబును కష్టడిలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈజీ మనీ కోసమే వీరంతా ఫేక్ కరెన్సీ తయారీకి పూనుకున్నారని డీసీపీ శబరిష్ పేర్కొన్నారు.