Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఖదీర్ఖాన్(37) మృతిపై హైకోర్టు స్పందించింది. పత్రికల్లో వచ్చే కథనాలను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా చేర్చింది. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకే మెదక్కు చెందిన ఖదీర్ ఖాన్ మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఓ గొలుసుచోరీ కేసులో అనుమానంతో మెదక్ పట్టణ ఠాణా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేయగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో ఖదీర్ మృతిచెందినట్లు ఆయన భార్య సిద్ధేశ్వరి వెల్లడించిన విషయం తెలిసిందే. అయిదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం... తర్వాత నేరం చేయలేదని వదిలిపెట్టడం.. అతడు ఆస్పత్రికి వెళ్తే తమ నిర్వాకం బహిర్గతమవుతుందని ఇంట్లోనే ఉండి మందుబిళ్లలు వేసుకోవాలని చెప్పడం... ఎట్టకేలకు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చివరకు ప్రాణాలు కోల్పోవడం ఈ ఉదంతంలో ప్రచారంలోకి వచ్చిన కీలకాంశాలు. దీనిని సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది.