Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చైనాను హెచ్చరించారు. సోమవారం ఆయన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఒకవేళ చైనా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు మద్దతు ప్రకటిస్తే ఇది ప్రపంచ యుద్ధాన్ని తెచ్చేందుకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఆ దేశం రష్యాకు మద్దతు ప్రకటించకుండా ఉండటం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. చైనా తమ పక్షాన ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. కానీ, అది సాధ్యంకాకపోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇక్కడేం జరుగుతోందన్నదానిపై చైనా ఆచరణాత్మక విశ్లేషణ చేసుకోవాలని కోరారు. ఎందుకంటే చైనా రష్యాతో జట్టుకడితే ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విషయం ఆ దేశానికీ తెలుసునని పేర్కొన్నారు. మాల్డోవా అంశాన్ని జెలెన్స్కీ ప్రస్తావిస్తూ తనకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆ దేశ అధ్యక్షురాలు మైయ సందుకు అందజేసినట్లు వెల్లడించారు. అక్కడ రష్యా అనుకూల వర్గాలు తిరిగుబాటుకు యత్నిస్తున్నాయని చెప్పారు. అందుకు ఆమె ధన్యవాదాలు తెలిపిందన్నారు. మాల్డోవా రక్షణకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. గత వారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మ్యూనిక్ రక్షణ సదస్సులో చైనా దౌత్యవేత్త వాంగ్యీను హెచ్చరించారు. చైనా నుంచి రష్యాకు పరికరాల సాయం చేసిన వారు పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీజింగ్ నుంచి మాస్కోకు ఆయుధాలు వెళతాయని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో జెలెన్స్కీ హెచ్చరికలు రావడం గమనార్హం.