Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. కేసు విచారణకు ఆయన హాజరుకావడం ఇది రెండో సారి. ఈనాటి విచారణలో ముఖ్యంగా రూ. 40 కోట్ల డీల్ పై అవినాశ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ బెయిల్ కౌంటర్ లో సీబీఐ సంచలన విషయాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. హత్య జరిగిన రోజు నిందితులంతా అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించినట్టు సీబీఐ తెలిపింది. హత్య కుట్ర మొత్తం అవినాశ్ కు ముందే తెలుసని పేర్కొంది.
మరోవైపు విచారణ కోసం తన న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి అవినాశ్ రెడ్డి వెళ్లారు. అయితే, లాయర్ ను సీబీఐ అధికారులు అనుమతించలేదు. ఒక ప్రత్యేక గదిలో అవినాశ్ ను విచారిస్తున్నారు. అవినాశ్ ను విచారిస్తుండటం ఇది రెండో సారి కావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే... ఎవరినైనా సీబీఐ రెండో సారి విచారణకు పిలిస్తే... వారిని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.