Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
కేరళలోని మలప్పురం జిల్లాలో అక్వేరియంలో పెంచుతున్న చేప చనిపోయిందన్న మనస్తాపంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నానిలోని ఒక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల రోషన్ మీనన్ 8వ తరగతి చదువుతున్నాడు. అతడికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పావురాలతోపాటు ఇంట్లోని అక్వేరియంలో చేపలు పెంచుతున్నాడు. అయితే అక్వేరియంలో పెంచుతున్న చేపల్లో ఒకటి ఇటీవల చనిపోయింది. దీంతో రోషన్ తీవ్ర మనస్తాపం చెందాడు.
ఈ తరుణంలో శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు. రోషన్ ఎక్కడా కనిపించలేదు. చివరకు మేడ పైకి వెళ్లారు. అక్కడున్న షెడ్లో ప్లాస్టిక్ తాడుకు వేలాడుతున్న రోషన్ను చూసి షాకయ్యారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో రోషన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.