Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇంఫాల్: వాళ్లంతా 12వ తరగతి విద్యార్థులు ఓ పరీక్షా కేంద్రంలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లో పరీక్ష ముగియనుంది. తమకు ఎగ్జామ్ రాయడం ఇంకా పూర్తికాలేదని, మరికొంత సమయం కావాలని డిమాండ్ చేశారు. అయినా నిర్వాహకులు తమపని తాము చేసుకుపోయారు. నిర్ణీత సమయానికే చివరి గంట మోగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు ఏకంగా ఎగ్జామ్ సెంటర్లో ధ్వంసం చేశారు. ఈ ఘటన మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
మణిపూర్లో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తౌబాల్ జిల్లా యైరిపోక్లోని ఏసీఎంఈ హయ్యర్ సెకండరీ స్కూల్లో పరీక్ష కేంద్రం పడింది. శనివారం మణిపురి పేపర్ పరీక్ష నిర్వహించారు. అయితే ఏసీఎం స్కూల్లో 405 మంది పరీక్ష రాస్తున్నారు. వారిలో కొందరు తమకు పరీక్ష రాయడానికి సమయం సరిపోలేదని, మరికొంత టైమ్ ఇవ్వాలని ఇన్విజిలేటర్ను కోరారు. ఐదు నిమిషాల్లో సమయం ముగుస్తుండగా ఆందోళనకు దిగారు. అయితే నిర్ణీత సమయానికి బెల్ మోగింది. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దాడికి దిగారు. స్కూల్లో బెంచీలు విరగొట్టారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ టీచర్తో సహా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధ్యులైన 8 మంది విద్యార్థులపై కేసు నమోదుచేశారు.