Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
2024 టీ20 ప్రపంచకప్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా యాజమాన్యానికి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. జట్టు తడబడకుండా ఉండాలంటే టీ20లకు ప్రత్యేక కోచ్ని నియమించాలన్నాడు. మిగిలిన ఫార్మాట్లలో బాధ్యతలను మరో కోచ్ చూసుకోవాలని తెలిపాడు.
‘అవును, టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. భిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు. ఇంగ్లాండ్ బ్రెండన్ మెక్కల్లమ్ని కోచ్గా నియమించుకుంది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిశ్ నెహ్రాతో ప్రయోగం చేయవచ్చు. నెహ్రా శిక్షణలో హార్దిక్ పాండ్య ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా పని చేసి విజయం సాధించాడు. కాబట్టి, టీ20 కాన్సెప్ట్ను, ఆ ఫార్మాట్ అవసరాలను గుర్తించే వారిని కోచ్గా నియమించండి. ప్రస్తుతం దృష్టంతా టీ20లపైనే ఉంది. పొట్టి ఫార్మాట్లో భారత జట్టును ఛాంపియన్గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రాకు తెలుసు. టెస్టులు, వన్డేలలో టీమ్ఇండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు ద్రవిడ్ వద్ద ఉన్నాయి’ అని హర్భజన్ సింగ్ అన్నారు.
2024లో టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో బీసీసీఐ ఇప్పటి నుంచే యువ జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సీనియర్లు అయిన రోహిత్, విరాట్ కోహ్లీలను టీ20లకు ఎంపిక చేయకుండా పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది.