Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హనుమకొండ
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ తరుణంలో ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాం. కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావొచ్చు సంజయ్ కావొచ్చు ఇంకెవడైనా సరే వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం అని అన్నారు.